ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిన పార్టీ కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ 23మంది ఎమ్మెల్యేలను నిలుపుకోవడం కూడా చంద్రబాబుకు పెనుసవాలుగా మారింది. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ , ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం , గుంటూరు జిల్లా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు చంద్రబాబుకు దూరమయ్యారు. వీరంతా జగన్కు చేరువు అయ్యారు. ఇక ప్రస్తుతం పార్టీకి మిగిలిన 20 మంది ఎమ్మెల్యేలలో కూడా ఐదారుగురు పక్కచూపులు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక లోకేష్ నాయకత్వంపై నమ్మకం లేని పలువురు నేతలు సైతం తమ దారి తాము చూసుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక 70 సంవత్సరాల వయసులో నిరంతరం పార్టీ కోసం కష్టపడుతున్న చంద్రబాబు చేస్తున్న కొన్ని తప్పులు వల్లే పార్టీ ఇప్పటికీ పుంజు కో లేదన్న ఆరోపణలు సొంత పార్టీ నేతల నుంచే ఉన్నాయి. ఇక టీడీపీ భవిష్యత్తు పై నమ్మకం లేని కొందరు సీనియర్ నేతలు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. చంద్రబాబు కీలకంగా ఉన్న నేతలు సైతం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. ఈ సీనియర్ నేతలంతా మౌనంగా ఉండడంతో చంద్రబాబు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక పార్టీ సీనియర్లు కూడా ఇలాంటి కష్ట కాలంలో బయటకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేయక పోవడం.. ఎవరి స్వలాభం వారు చూసుకోవడంతో చంద్రబాబు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్లకు పదవులు కావాలి కాని.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కాని.. పార్టీ అధినేత కాని పట్టరు.. అస్సలు ప్రజలు, కేడర్ అంటే పట్టించుకోరా ? అని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట. ఈ లిస్టులో తూర్పు గోదావరి జిల్లాతో పాటు సీమ జిల్లాలు.. వైజాగ్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ఉన్నట్టు సమాచారం.