భారత్ పై కరోనా వైరస్ పంజా విసురుతోంది. శాస్త్రవేత్తలు వైరస్ గురించి చేస్తున్న పరిశోధనల్లో వైరస్ కు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందా....? అనే విషయం గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా గురించి అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో వెంటిలేషన్ వ్యవస్థ సరిగ్గా లేని ప్రాంతాల్లో వైరస్ వేగంగా వ్యాపిస్తోందని తేలింది.
 
తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో రద్దీ ఎక్కువగా ఉండే నైట్ క్లబ్ లు, రెస్టారెంట్లు, ఇతర ప్రదేశాల్లో వైరస్ ఎక్కువగా గాల్లోనే ఉండొచ్చని తేలింది. సరైన వెంటిలేషన్ వ్యవస్థ లేకపోవడం వల్లే ఈ ప్రదేశాల్లో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని... వెంటిలేషన్ వ్యవస్థ సరిగ్గా లేని ప్రాంతాల్లో లోపలి గోడలు, ఉపరితలాలకు వైరస్ అతుక్కుపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 
రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో గాలి, వెలుతురు ప్రసరణ వ్యవస్థలను ప్రత్యేకంగా రూపొందించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మిన్నెసోటో యూనివర్సిటీకి చెందిన జియారాంగ్ హంగ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించింది. వెంటిలేషన్ లేని గదుల్లో మాత్రమే చిన్నపాటి సుడిగుండాలు ఏర్పడుతున్నాయని... ఫలితంగా తుంపర్లలో చాలా భాగం వాటిలో చిక్కుకుపోయి సుడులు తిరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 
మెరుగైన వెంటిలేషన్ ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని.... సరైన వెంటిలేషన్ లేకపోవడం వల్ల సాధారణ సమయం కాన్నా ఎక్కువ సమయం వైరస్ గాలిలో ఉంటున్నట్లు ఇతర పరిశోధనల్లో తేలింది. ఒక అధ్యయనంలో మాటల ద్వారా వెలువడే తుంపర్లు 8 నుంచి 14 నిమిషాల పాటు గాల్లో ఉంటున్నట్లు వెల్లడైంది. శాస్త్రవేత్తలు ఆరుబయట లేదా ధారాళంగా వెలుతురు వచ్చే గదుల్లో ఉండాలని... వెంటిలేషన్ లేని గదుల్లో ఉండటం మంచిది కాదని సూచిస్తున్నారు. మరోవైపు దేశంలో రికార్డుస్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: