ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ.. అంటూ మహాత్మ సినిమాలో ఓ పాట ఉంటుంది. అది గాంధీ తత్వాన్ని వివరిస్తుంది. కరెన్సీ నోటుపై కనిపించే బొమ్మే కాదు గాంధీ అంటూ గేయ రచయిత వర్ణిస్తాడు.. ఇక పొద్దున లేస్తే.. చాలు కరెన్సీ నోటు చూడందే మనకు పొద్దు గడవదు. ఆ కరెన్సీ నోటుపై బోసి నవ్వులు చిందిస్తూ గాంధీ తాత కనిపిస్తాడు. అలా మన జాతిపిత మోహన్‌దాస్‌ కరమ్‌ చంద్ గాంధీ మన కరెన్సీపైకి వచ్చేశాడు. మన ఇండియాలోనే కాదు.. అనేక దేశాల్లో వాళ్ల జాతి పితలను కరెన్సీ నోటుపై ముద్రించుకుని గౌరవించుకుంటారు.


అయితే.. ఇప్పుడు ఓ కొత్త డిమాండ్ వస్తోంది. ఇండియన్ కరెన్సీపై ఉండాల్సింది గాంధీ బొమ్మ కాదు.. అంబేడ్కర్ బొమ్మ అంటూ కొందరు వాదిస్తున్నారు. భారతదేశ కరెన్సీపై రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ చిత్రాన్ని ముద్రించాలన్న డిమాండ్ కొందరు తెరపైకి తెస్తున్నారు. తాజాగా  రాజ్యసభ సభ్యుడు డా.బండా ప్రకాష్‌ ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన  ఈ అంశాన్ని పార్లమెంటులోనూ ప్రస్తావిస్తానంటున్నారు. రాజ్యసభ సభ్యుడిని కాబట్టి సభలో దీనిపై మాట్లాడతానంటున్నారు.


భారత కరెన్సీ నోటుపై అంబేడ్కర్ ఫోటోను సాధించడం కోసం అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి పేరుతో ఓ సంఘం కూడా ఏర్పడింది. ఈ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26న జ్ఞాన యుద్ధ యాత్ర పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ యాత్ర జరుగుతుందట. ఈ యాత్ర
యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ప్రారంభమై వచ్చే ఏడాది అంబేడ్కర్ జయంతి అయిన  ఏప్రిల్‌ 14వ వరకు దేశవ్యాప్తంగా జరుగుతుందట.


ఈ జ్ఞానయుద్ధ యాత్ర’ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ ను  ఎంపీ బండ ప్రకాశ్  ఆవిష్కరించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను బడుగు, బలహీన వర్గాలు దేవుడి కంటే మిన్నగా భావిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన వల్లే తాము ఈ మాత్రం సమాజంలో ఉన్నామని వారు భావిస్తుంటారు. అందుకే ఇండియన్ కరెన్సీపై గాంధీ కాదు అంబేడ్కర్ చిత్రం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ డిమాండ్ ఫలిస్తుందా..?

మరింత సమాచారం తెలుసుకోండి: