భార‌త ప్ర‌భుత్వానికి పెను స‌వాల్‌గా మారిన మావోయిస్ట్ అగ్ర‌నేత మాద్వి హిడ్మా మంగ‌ళ‌వారం ఏపిలోని అల్ల‌రి జిల్లాలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో మృతిచెందారు. ఏపీలోని మారేడుమిల్లిలో మంగ‌ళ‌వారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు ఆరుగురు మృతి చెందారు. ఈ మెరుపు దాడుల మాస్ట‌ర్ మైండ్ హిడ్మా మృతి చెంద‌డంతో సంచ‌ల‌నం రేకెత్తించింది. ఆయ‌న‌ది ఛ‌త్తీస్ ఘ‌డ్ సుక్మా జిల్లాలోని పువ‌ర్తి గ్రామం. ఐదారు భాష‌ల్లో హిడ్మాకు మంచి ప్రావీణ్యం ఉంది. హిందీ , గోండి , తెలుగు , కోయ , బెంగాలీ భాషల్లో హిడ్మాకు మంచి పట్టు ఉంది. కేవ‌లం ప‌దో త‌ర‌గ‌తి వ‌రకే చ‌దువుకున్నా కూడా ఆంగ్లం లోనూ హిడ్మాకు మంచి ప‌ట్టు ఉంద‌ని అంటారు.


ఇక మావోయిస్టు ల్లో హిడ్మా దళానికి అత్యంత శక్తివంతమైన దళంగా పేరుంది. భారీ ఆపరేషన్లలో హిడ్మాదే మాస్టర్‌ మైండ్ అని చెపుతుంటారు. ఇక ప‌లు భారీ దాడుల‌లో పాల్గొంటూ వాటికి నేతృత్వం వ‌హిస్తూ కేంద్ర బలగాలకు మోస్ట్‌ వాంటెడ్‌గా హిడ్మా మారాడు. చివ‌ర‌కు హిడ్మాను ప‌ట్టుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఏకంగా అత‌డి త‌ల‌పై రు. కోటి రివార్డు కూడా ప్ర‌క‌టించింది. ఇక హిడ్మా భార్య హేమపై రూ.50 లక్షల రివార్డ్ ఉంది. ఈ ఎన్కౌంటర్ లో ఆయన భార్య కూడా మరణించింది. ఇక హిడ్మా పూర్తి పేరు మ‌డ్వి హిడ్మా. ఇప్ప‌టి వ‌ర‌కు హిడ్మా 26 దాడుల్లో కీల‌క నిందితుడిగా ఉన్నాడు. 2007 లో సుక్మా జిల్లా ఉర్పల్మెట్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసి క్రూరంగా హ‌త‌మార్చాడు.


2010 లో తడ్మెట్ల మెరుపుదాడి చేశాడు. ఈ దాడుల్లో ఏకంగా 76 మంది జవాన్లు మృతి చెందారు. 2013 లో జీరామ్ ఘాటీ దగ్గర కాంగ్రెస్ నేతలను పాశ‌వికంగా ఊచకోత కోశారు. 2017 ఏప్రిల్లో సుక్మా జిల్లాలో 27 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చ‌డంలో హిడ్మాదే కీల‌క‌పాత్ర‌. 2021 ఏప్రిల్ 4 వ తేదీన బీజాపూర్ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కుకుని 23 మంది జవాన్లు మృతి చెందారు. ఇక మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌కి ముందు ఆయ‌న‌ను ప‌ట్టుకునేందుకు ఛ‌త్తీస్ ఘ‌డ్ ప్ర‌భుత్వం రెండేళ్లుగా ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసింది. చివ‌ర‌కు మావోయిస్టుల కంచుకోట సుక్మా జిల్లా, పూవర్తి గ్రామంలో ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ పర్యటించడం తో పాటు హిడ్మా త‌ల్లి తో క‌లిసి ఆయ‌న భోజ‌నం కూడా చేశారు.


అలాగే ఆయ‌న హిడ్మా లొంగుబాటుకి కృషి చేయాలంటూ హిడ్మా త‌ల్లిని అభ్యర్ధించారు. వీలైనంత త్వరగా హిడ్మా లొంగుబాటుకి కృషి చేయాలని కోరారు. అయితే అందుకు కృషి చేస్తానని హిడ్మా తల్లి సానుకూల స్పందించారు. నవంబర్ 10న భారీ బందోబస్తు నడుమ విజయ్ శర్మ పువ‌ర్తి గ్రామంలో పర్యటించారు. సరిగ్గా 8 రోజుల  తర్వాత.. భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో హిడ్మాతో పాటు ఆయన భార్య రాజక్క మృతి చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: