వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మూల మార్కెట్ విలువల్ని పెంచాలని కేసీఆర్ సర్కారు డిసైడ్ చేసింది. ఈ మేరకు ప్రాధమికంగా ఓ నిర్ణయం జరిగింది. త్వరలోనే ఆర్డీవోల నేతృత్వంలోని కమిటీలు కొత్త మార్కెట్ విలువల్ని ఖరారు చేస్తాయి. ఏదేమైనా ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. వారం రోజుల్లో చార్జీ పెంపు కార్యాచరణ వేగవంతం చేస్తారు. ఏ ప్రభుత్వంలోనైనా ఇలాంటి చార్జీలు పెరుగుతూనే ఉంటాయి. కానీ.. విచిత్రం ఏంటంటే.. తెలంగాణలో ఏడేళ్ల తర్వాత గతేడాదే వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువలు పెంచారు. వాటితో పాటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు రుసుంలను కూడా తెలంగాణ ప్రభుత్వం పెంచింది.
ఆ పెంచడం కూడా భారీగా 20 శాతం వరకూ పెంచేశారు. ఇది జరిగి ఏడాది తిరక్కముందే ఇప్పుడు మళ్లీ పెంచాలని డిసైడ్ అయ్యారు. మార్కెట్ విలువ, వ్యవసాయేతర ఆస్తుల విలువల పెంచాలని నిన్న జరిగిన రిజిస్ట్రేషన్ శాఖ కీలక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘంగా చర్చించి మార్కెట్ విలువల్ని ఏమేరకు పెంచాలన్న అంశంపై చర్చించారు. ఒకట్రెండు రోజుల్లో పెంపు ప్రతిపాదనలను ఫైనల్ చేస్తారు. మొత్తానికి త్వరలోనే మార్కెట్ విలువల్ని పెంచి అమలు చేయాలని డిసైడ్ అయ్యారు.
ప్రస్తుతం వ్యవసాయ భూముల కనీస ధర ఎకరం 75 వేలుగా ఉంది. గతంలో తక్కువ విలువ ఉన్న భూమి మార్కెట్ రేటును 50 శాతం పెంచారు. మధ్యశ్రేణి భూముల విలువను 40శాతం పెంచారు. ఎక్కువ విలువ ఉన్న భూమి ధరను 30శాతం మేర పెంచారు. మరి ఇప్పుడు ఎంత పెంచుతారో..?