రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ లోని డోనెట్స్క్, లుహాన్స్, ప్రాంతాలను స్వతంత్ర స్టేట్స్ గా ప్రకటిస్తూ డిక్రీపై సంతకం చేశారు. దీంతో ఈ చర్యను పుతిన్ వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు పరిగణిస్తున్నారు. ఇక రష్యా నిర్ణయంపై మండిపడిన ఉక్రెయిన్ అధ్యక్షడు జెలెన్స్కీ.. తమ దేశ భద్రతపై అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తో మాట్లాడారు.

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ పరిణామాల కారణంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని..ఇతర దేశాల కంట్రోల్ లో ఉందంటూ పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ ను ఆటబొమ్మను చేసి ఆడిస్తున్నారని..ఆ దేశం వద్ద అనుబాంబు ఉందన్నారు. కొన్ని దేశాల ఆర్మీ మద్ధతుతో రష్యాపై ఉక్రెయిన్ దాడి చేయాలని చూస్తోందని పుతిన్ ఆరోపించారు.

ఇక ఐదుగురు ఉక్రెయిన్ సైనికులను హతమార్చినట్టు రష్యా సైన్యం ప్రకటించింది. యుద్ధ వాహనాల్లో ఉక్రెయిన్ సాయుధ దళాలు తమ భూభాగంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించాయని.. వారిని నిలువరించేందుకు జరిపిన కాల్పుల్లో ఐదుగురు సైనికులు హతమయ్యారని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ వార్తలను ఉక్రెయిన్ మిలటరీ తోసిపుచ్చింది. రెచ్చగొట్టేందుకు రష్యా రూపొందించిన తప్పుడు ప్రచారమని తెలిపింది.

మరోవైపు ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతల తరుణంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ లో వేర్పాటువాద ప్రాంతాలైన డొనెట్స్క్, లుహాన్స్క్ ను.. రష్యా స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించడంపై బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు ప్రాంతాలపై ఆంక్షలు విధిస్తూ.. బైడెన్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అక్కడ పెట్టుబడులు, వాణిజ్యంపై నిషేధం విధిస్తున్నారని అమెరికా వెల్లడించింది. మొత్తానికి రష్యా-ఉక్రెయిన్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. అయితే రష్యా అధ్యక్షుడి వ్యాఖ్యలపై అమెరికా మండిపడుతోంది. ఉక్రెయిన్ కు అండగా నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: