నారా లోకేశ్ రెడ్ బుక్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. ఎందుకంటే యువగళం పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అది చేత్తో పట్టుకొని కనిపిస్తున్నారు నారా లోకేశ్. అందులో అధికారుల పేర్లు రాసుకొస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెడుతున్న అధికారుల పేర్లను అందులో పొందుపరుస్తున్నానని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూసే బాధ్యత ఈ లోకేశ్ తీసుకుంటాడని పలు సభల్లో వ్యాఖ్యానించారు.


అయితే ఇప్పుడీ రెడ్ డైరీనే నారా లోకేశ్ ని ఇరికించినట్లు తెలుస్తోంది. తాజాగా టీడీపీ నేత నారా లోకేశ్ పై ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది. నారా లోకేశ్ 41ఏ నిబంధనలు ఉల్లంఘించారని అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఇందులో భాగంగా చంద్రబాబు కేసుల్లో దర్యాప్తు అధికారులను రెడ్ బుక్ పేరుతో లోకేశ్ బెదిరిస్తున్నారని సీఐడీ తన పిటిషన్ లో పేర్కొంది.


వాస్తవానికి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో గతంలోనే సీఐడీ లోకేశ్ కు 41ఏ కింద నోటీసులు ఇచ్చింది.  అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ముందస్తు బెయిల్ పిటిషన్ పై కీలక పరిణామం చోటు చేసుకుంది. రెడ్ డైరీ ప్రభావం ఈ కేసుపై పడినట్లు తెలుస్తోంది.


అధికారులను రెడ్ డైరీ పేరుతో బెదిరిస్తున్నారని.. చంద్రబాబు నాయుడి కేసులను విచారిస్తున్న అధికారులపై తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చర్యలు తీసుకుంటామని లోకేశ్ అంటున్నారని కోర్టుకు తెలిపింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని చంద్రబాబుకి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ కోరింది.  అదేవిధంగా లోకేశ్ పై చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఙప్తి చేసింది. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు బెయిల్ పిటిషన్ పై చంద్రబాబు తరఫు లాయర్లు లిఖితపూర్వక వాదనలు కోర్టులో దాఖలు చేశారు. తీరా తీర్పు వచ్చే సమయానికి రెడ్ డైరీ అంశం కోర్టు దృష్టి కి రావడంతో విచారణ వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: