
గతంలో 2014-19 మధ్య టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే శ్రీనివాసరావుపై వసూళ్ల ఆరోపణలు వచ్చాయి. ఆయన కాలంలో నెగటివ్ ప్రచారం బలంగా సాగింది. కానీ చిర్రి బాలరాజు పరిపాలనలో అవినీతి ఆరోపణలే తలెత్తలేదు. ఇది ఆయనకు కలిసొచ్చిన ముఖ్యమైన విషయం. అవినీతి ఆరోపణల బరువు లేకుండా సాగుతున్న చిర్రి పాలనకు, ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా, స్థానిక సమస్యలపై చిర్రి బాలరాజు స్పందన కూడా పాజిటివ్గా ఉందనే ప్రచారం ఉంది. ముఖ్యంగా రోడ్ల అభివృద్ధిపై ఆయన చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఇచ్చాయి. గతంలో సదుపాయాల లేకుండా బెంబేలెత్తిన గ్రామాలు, ఇప్పుడు కనీస రహదారి కనెక్షన్లు పొందుతున్నాయి. తాగునీటి సమస్యల పరిష్కారానికి కూడా చిర్రి బాలరాజు చురుగ్గా వ్యవహరిస్తున్నారు . వర్షాకాలంలో పోలవరం ప్రాంతాల్లో వచ్చే వరదల కారణంగా తుడిపాడు గల ప్రాంతాల్లో ప్రజలకు ముందస్తు అప్రమత్తత చర్యలు తీసుకోవడం, సహాయ శిబిరాల ఏర్పాటుపై దృష్టి పెట్టడం ఆయన పాలనా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోంది.
అయితే, నియోజకవర్గంలో నిర్వాసితుల సమస్య మాత్రం కొనసాగుతూనే ఉంది. గతంలో భూములు కోల్పోయిన వారికి ఇంకా పూర్తి పరిహారం అందకపోవడం వల్ల చిర్రి బాలరాజుపై ఒత్తిడి పెరుగుతోంది. కానీ, ఈ సమస్య ప్రభుత్వ స్థాయిలో పరిష్కారానికి చెందాల్సినదిగా ఆయన నిర్దేశిస్తున్నారని తెలుస్తోంది. ఇక పార్టీ పట్ల ఆయన నిబద్ధత, అధిష్టానానికి అనుసరంగా పని చేయడం ఆయనకు బలాన్ని ఇచ్చిన అంశాలు. ప్రస్తుతం గ్రూపు రాజకీయాలు లేకుండా, నేరుగా ప్రజలతో ఉంటూ పని చేయడం వల్ల చిర్రికి మంచి గుర్తింపు లభించింది. మొత్తంగా చెప్పాలంటే, నియోజకవర్గంలో ఆయన పని తీరుపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నా, ఆరోపణల స్వరం లేకుండా, నిష్కళంకంగా సాగుతున్న పాలన మాత్రం చిర్రి బాలరాజుకు పాజిటివ్ ఇమేజ్ ఇచ్చిన విషయంలో సందేహం లేదు. వచ్చే ఎన్నికల్లో ఇది ఎంత మేర సహయ పడుతుందో చూడాలి.