
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీహార్ ఎన్నికల గురించి చర్చ జోరుగా సాగుతోంది. బీహార్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశం హాట్ టాపిక్గా మారింది. గెలుపు కోసం అన్ని పార్టీలు హామీల మీద హామీలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఎన్నికల హామీల పర్వాన్ని కొనసాగిస్తున్నారు.
ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ వర్కర్స్ను పర్మినెంట్ చేస్తామని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా, వారికి నెలకు రూ. 30,000 జీతం కూడా ఇస్తామని తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారు. మహా గట్బంధన్ కూటమి అధికారంలోకి వస్తే ఈ హామీలను తప్పక నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుండా, రాష్ట్రంలో ఉన్న స్వయం సమృద్ధి మహిళా సంఘాలలో పని చేస్తున్న వారికి కూడా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగం ఇవ్వడంతో పాటు నెలకు రూ. 30,000 జీతం ఇవ్వనున్నట్టు తేజస్వీ యాదవ్ తెలిపారు. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ చేస్తామని, అలాగే రెండేళ్ల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఆయన ప్రకటించారు.
మహిళా సంఘాలు ఇతర ప్రభుత్వ పనుల్లో పాలు పంచుకుంటే నెలకు రూ. 2,000 ప్రభుత్వ అలవెన్స్ ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. అదనంగా, రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తామని పేర్కొన్నారు. తల్లీకూతురుకు సంబంధించిన స్కీమ్ ప్రకారం విద్య, ఉద్యోగం, శిక్షణ (ట్రైనింగ్), ఆదాయం క్రమంలో లాభం చేకూర్చనున్నట్టు వివరించారు. బీహార్ ప్రభుత్వంలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మార్పులన్నీ చేస్తామని తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. ఈ హామీలు ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు