రోడ్లపై గుంతలతో బెంగళూరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగా బద్నామ్ అయిపోయిందో అందరికీ తెలుసు. కానీ అదే తప్పును ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా పునరావృతం చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా… రోడ్ల నిర్వహణలో పెద్ద మార్పు కనిపించడం లేదు. హైదరాబాద్‌ నగర రోడ్లు క్షీణావస్థకు చేరుకున్నాయి. ప్రతి ప్రధాన రహదారిపై గుంతలే గుంతలు! చిన్న వర్షం పడితే రోడ్లు కొట్టుకుపోతున్నాయి. ఫలితంగా ప్రతిరోజూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎన్ని ప్రాణాలు పోయినా – అధికారులు మాత్రం కళ్లెదుటే నిశ్శబ్దంగా చూస్తున్నారు. గుంత వల్ల జరిగే ప్రమాదం అనేది సహజం కాదు, అది ప్రభుత్వ హత్యే.
 

ఎందుకంటే రోడ్ల నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదే. నిధులు కేటాయించి రోడ్లను సక్రమంగా సంరక్షించడం అధికారులు చేయాల్సిన పని. చేవెళ్ల రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదం కూడా ఒక గుంత కారణంగానే జరిగింది. వేగంగా వస్తున్న టిప్పర్‌ గుంతలో పడటంతో అదుపు తప్పి బస్సును ఢీకొట్టింది. ఈ సంఘటనలో పలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణం తర్వాత కూడా ఆ గుంతను పూడ్చే ప్రయత్నం ఎవ్వరూ చేయకపోవడం రాష్ట్ర పాలనపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రజల ప్రాణాలతో రాజకీయ ప్రదర్శనలు చేయడం అనాగరికం. ప్రభుత్వం ఒకవైపు ఉచిత బస్సు పథకం పేరుతో కోట్ల రూపాయల బడ్జెట్‌ ఖర్చు చేస్తోంది. కానీ రోడ్ల సంరక్షణకు మాత్రం రూపాయి కేటాయించడంలో వెనుకబడుతోంది. ఆర్అండ్‌బీ శాఖకు ఇచ్చే నిధులన్నీ ఇతర పథకాలకు మళ్లించడం వలన మౌలిక సదుపాయాలు పతనమవుతున్నాయి.

 

పథకాలు పాపులర్‌ కావొచ్చు కానీ, రోడ్లపై ప్రాణాలు పోతే అది పాలకుల వైఫల్యమే. ఇప్పుడు కర్ణాటకలో జరిగినదే తెలంగాణలో జరగకూడదు. అక్కడ ప్రభుత్వం ఆలస్యంగా అయినా మేలుకుని భారీ ఎత్తున రోడ్ల పునరుద్ధరణ చేపట్టింది. కానీ అప్పటికి ప్రజల నమ్మకం కోల్పోయింది. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే దిశగా వెళ్తే ప్రజల ఆగ్రహం తప్పదు. మౌలిక సదుపాయాలే రాష్ట్ర అభివృద్ధికి పునాది. రోడ్లు సక్రమంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, ఆర్థిక చైతన్యం పెరుగుతుంది. కాబట్టి, రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే చర్యలు తీసుకోవాలి. ఉచిత పథకాల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం అన్న భావనతో రోడ్ల నిర్వహణపై స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభించాలి. లేకపోతే బెంగళూరును మించిన దుస్థితి హైదరాబాద్‌లో తప్పదనే భయాందోళనలు వ్యాపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: