బీహార్ - దేశ రాజ‌కీయాల్లో సైలెంట్‌గా ఉండే కానీ బిగ్ సౌండ్ ఇచ్చే రాష్ట్రం. హిందీ బెల్ట్ హార్ట్‌ల్యాండ్‌లో కీల‌క స్థానంలో ఉన్న ఈ రాష్ట్రం ఇప్పుడు మ‌ళ్లీ జాతీయ స్థాయి చ‌ర్చ‌ల కేంద్రంగా మారింది. బీహార్ ఎన్నిక‌ల ఫ‌లితాలు నవంబర్ 14న రానున్నాయి. కానీ ఫ‌లితాల కంటే ముందే దేశ రాజ‌కీయం మొత్తం ఈ రాష్ట్రం చుట్టూ తిరుగుతోంది. కాంగ్రెస్ నేత‌లు “బీహార్‌లో మార్పు వస్తే జాతీయ స్థాయిలో మార్పు ఖాయం” అంటున్నారు. ఆ న‌మ్మ‌కానికి కారణం స్ప‌ష్టం - బీహార్ రాజకీయంగా ఎప్ప‌టిక‌ప్పుడూ కేంద్రంపై నేరుగా ప్ర‌భావం చూపే రాష్ట్రం. జేడీయూ అధినేత, సీఎం నితీష్ కుమార్ పాత్ర కూడా అంతే కీల‌కం. ఆయన నిర్ణయం దేశ ప్రభుత్వాల భవిష్యత్తును మార్చగలదు అనేది రాజకీయ వాస్తవం. నితీష్ కుమార్ ఈసారి ఓడిపోతే, బీహార్ రాజకీయాలు మాత్రమే కాదు, ఢిల్లీలోని అధికార సమీకరణలకూ తారుమారవుతాయి అంటున్నారు విశ్లేషకులు.
 

గత రెండు దశాబ్దాలుగా ఆయన సీఎం పదవిలో కొనసాగుతున్నారు. ఎన్నోసార్లు కూటములు మార్చినా, చివరికి అధికారంలోనే నిలిచారు. కానీ ఈసారి ఓటమి రుచి చూస్తే, నితీష్ ఖాళీగా కూర్చోరని, కొత్త వ్యూహాలతో జాతీయ రాజకీయాల్లో అడుగుపెడతారని అంచనా. ఇక విశ్లేషకులు నితీష్ కుమార్‌ను మాజీ ఏపీ సీఎం మర్రి చెన్నారెడ్డితో పోలుస్తున్నారు. చెన్నారెడ్డి ఖాళీగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌లో కుదుపు వచ్చేది - ఆయనకు పదవి ఇవ్వడం తప్ప కాంగ్రెస్ పెద్దలు మరేం చేయలేకపోయారు. నితీష్ కూడా అలాంటి వారే అంటున్నారు నిపుణులు. ఆయన ఖాళీగా ఉంటే బీహార్‌లోనే కాదు, ఎన్డీయేలో కూడా భూకంపం తప్పదని భావిస్తున్నారు. కేంద్రంలో ఎన్డీయే సర్కార్ బలం టీడీపీ (ఏపీ నుంచి 16 ఎంపీలు) మరియు జేడీయూ (బీహార్ నుంచి 12 ఎంపీలు) మీదే ఎక్కువగా ఆధారపడింది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ ఓటమి తర్వాత ఇండియా కూటమి వైపు మొగ్గుతారా అన్న చర్చ ముమ్మరంగా సాగుతోంది.

 

ఇక‌ ప్రస్తుతం అది ఊహాగానమే అయినా, రాజకీయాల్లో ఏది అయినా క్షణాల్లో మారిపోవచ్చు. ఇక మరో సన్నివేశం కూడా చర్చలో ఉంది - బీహార్‌లో ఓటమి తర్వాత నితీష్‌ను కేంద్రంలోకి తీసుకురావాలన్న ప్లాన్. ఆయనకు కీల‌క శాఖ ఇవ్వడం, లేదా ఉపప్రధానిగా చేసే ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. కానీ బీజేపీ పెద్దలు దానిని అంగీకరిస్తారా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న. ఏదేమైనా, బీహార్ ఫలితాలు ఏ వైపుకు మొగ్గుతాయో అన్నదే ఇప్పుడు జాతీయ రాజ‌కీయాల ఫ్యూచర్‌ను డిసైడ్ చేయ‌నుంది. నితీష్ గెలిస్తే ఎన్డీయే బ‌ల‌ప‌డుతుంది. ఓడితే ఇండియా కూటమి హుషారెత్తుతుంది. కానీ ప్రధాని మోదీ నాయకత్వం ఉన్నంతవరకు కేంద్ర సర్కార్ కదిలే ప్రసక్తి లేదని కూడా విశ్లేషకుల అభిప్రాయం. సో... బీహార్ ఎన్నికల ఫలితాలు “బిగ్ సౌండ్” ఇవ్వబోతున్నాయి — వెయిట్ అండ్ సీ!

మరింత సమాచారం తెలుసుకోండి: