తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత తాజా వ్యాఖ్యలు తెలంగాణ‌ రాజకీయాల్లో హీటు పెంచేశాయి. నల్గొండ జిల్లాలో నిర్వహించిన తెలంగాణ జన జాగృతి యాత్రలో పాల్గొన్న ఆమె, అధికార పార్టీ కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో విమర్శలు సహజమని, కానీ అవి వ్యక్తిగత స్థాయికి చేరితే తీవ్రమైన పరిణామాలు తప్పవని కవిత స్పష్టం చేశారు. “నేను ఒక్కరినే అనుకుంటున్నారు కానీ నా యాత్రల్లో వస్తున్న ప్రజలను, ఈ తెలంగాణ సమాజాన్ని చూడండి. ప్రజా శక్తి ఎంత బలంగా ఉందో అందరికీ తెలిసిపోతుంది” అంటూ ఆమె వ్యాఖ్యానించారు. కవిత ఈ యాత్రలో భాగంగా నల్గొండ జిల్లా ఆసుపత్రులను కూడా సందర్శించారు. అక్కడి పరిస్థితులు చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇక్కడ సిబ్బంది ఉన్నారు, రోగులు కూడా బాగానే వస్తున్నారు. కానీ ఆసుపత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలే లేవు. రోగులు సరైన వైద్యం పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం దీన్ని గమనించాలిసింది” అంటూ ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.


అలాగే బీఆర్‌ఎస్ నాయకుల వైఖరిపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. “నల్గొండ జిల్లాలో అసలు ప్రతిపక్షమే లేదు. ఉన్నవారు కూడా అధికార పార్టీ నేతలతో చేతులు కలిపేశారు. ప్రజల తరఫున ప్ర‌శ్నించ‌డానికి నేనే రంగంలోకి దిగాను” అని కవిత పేర్కొన్నారు. అయితే తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇలాంటి దూషణలకు నేను భయపడను. నన్ను నొప్పించాలనుకునే వారికి ఫలితం తీవ్రమైనదే ఉంటుంది” అంటూ హెచ్చరించారు. తమ యాత్రకు సంబంధించి జాగృతి ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కొందరు చింపేశారని కవిత ఆరోపించారు. “మా వేగం, మా ప్రభావం తట్టుకోలేకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారు. కానీ ప్రజలందరూ ఈ సంగతిని గమనిస్తున్నారు” అన్నారు.


తాము చేస్తున్న పోరాటం వ్యక్తిగతం కాదని, అది ప్రజల సమస్యల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసంనని కవిత స్పష్టం చేశారు. “వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఈ యాత్ర తెలంగాణ ప్రజల గొంతుకగా మారుతుంది” అంటూ ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కవిత చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండింటినీ ఒకేసారి టార్గెట్ చేయడం ద్వారా కవిత తన రాజకీయ పునరాగమనానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: