సోషల్ మీడియా వేదికల్లో మైథిలీ ప్రభావం అసాధారణం. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో కలిపి ఆమెకు 1.1 కోట్ల మంది ఫాలోయర్లు ఉండగా, ఫేస్బుక్లో మాత్రం ఏకంగా 1.4 కోట్ల మంది అభిమానులు ఆమెను అనుసరిస్తున్నారు. 2024లో ఆమె పాడిన ‘శబరి’ పాట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టిని ఆకర్షించింది. ఆమె ప్రతిభకు ఆకర్షితులైన ప్రధాని స్వయంగా సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపించారు. అదే ఏడాది ఆమె ‘టాప్ 24’ జాబితాలో స్థానం దక్కించుకుంది. అంతేకాదు, ‘కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక కావడం ఆమె కళాత్మక ప్రయాణంలో ఒక కీలక మైలురాయి.
మైథిలీ సంగీత నేపథ్యం ఎంతో బలంగా ఉంది. ఆమె తండ్రి రమేశ్ ఠాకూర్ ఒక శాస్త్రీయ సంగీతకారుడు, గాయకుడు, అలాగే సంగీత ఉపాధ్యాయుడు. చిన్నప్పటి నుంచే కుమార్తెకు శాస్త్రీయ సంగీతం నేర్పడం ప్రారంభించారు. తల్లి భారతీ గృహిణి. మైథిలీతో పాటు ఆమె సోదరులు అయాచీ, రిషబ్ కూడా సంగీతాన్ని నేర్చుకుని, కుటుంబ సంగీత యాత్రలో భాగమయ్యారు. వారి ఇంట్లో జరిగే సంగీత సాధన పొరుగువారికి అసౌకర్యంగా మారుతుండటంతో, ఆ కుటుంబం 17 సార్లు ఇళ్లు మార్చాల్సి వచ్చిందని మైథిలీ తల్లి భారతీ ఓ సందర్భంలో వెల్లడించారు. ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని ఎన్నో కష్టాల్లో జీవనం సాగించామని కూడా ఆమె చెప్పింది. చివరకు 2017లో కుటుంబం తన సొంత ఇల్లు కొనుగోలు చేయగా, 2020లో మరో మంచి అపార్ట్మెంట్కు మారింది.
మైథిలీ ఠాకూర్ సంగీత ప్రస్థానం కూడా ఎంతో వైభవంగా సాగింది. ఆమె ‘ఇండియన్ ఐడల్’లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత ‘ఐ జీనియస్ యంగ్ సింగింగ్ స్టార్’ పోటీలో విజేతగా నిలిచింది. ‘రైజింగ్ సింగర్’ కార్యక్రమంలో రన్నరప్గా నిలిచి ప్రజాదరణను మరింత పెంచుకుంది. 2023లో ఎన్నికల సంఘం ఆమెను మధుబనీ జిల్లా బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఆ వెంటనే వచ్చిన సంవత్సరం ప్రధానమంత్రి మోదీ చేతులమీదుగా ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం ఆమె ఎదుగుదలకు మరో గుర్తింపు ఇచ్చింది. సోషల్ మీడియా వేదికలపై జానపద–భక్తి గీతాలతో ప్రజల మనసుల్లో స్థానం సంపాదించిన మైథిలీ, ఇప్పుడు ఎన్నికల ద్వారానే ప్రజా సేవలో ప్రవేశించి కొత్త అధ్యాయం ప్రారంభించింది. కళాకారిణిగా మొదలై ప్రజా ప్రతినిధిగా ఎదుగుతున్న ఆమె ప్రయాణం ఎంతో మంది యువతలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి