తెలుగు రాజకీయాల్లో... ముఖ్యంగా ఎన్నికల సమయంలో... కేకే సర్వే అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు! తమ సర్వే ఫలితాలు నూటికి నూరు శాతం కచ్చితంగా ఉంటాయని, గ్రౌండ్ రియాలిటీని ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తాయని చెప్పి ఈ సంస్థ విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది. 2019, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో లెక్క తప్పకుండా చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకే... కిరణ్ కొండేటి గారి పేరు తెలుగునాట మారుమోగిపోయింది! అప్పట్లో ఈ సంస్థ చెప్పిన నంబర్ల ప్రకారమే ఫలితాలు రావడంతో, ఇక కేకే సర్వే అంటే కళ్ళు మూసుకుని నమ్మేయొచ్చనే భావన పాలిటిక్స్ ఫాలో అయ్యే ప్రతీ ఒక్కరిలోనూ బలంగా ఏర్పడింది.

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక... రివర్స్ గేర్! అయితే, తాజాగా జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం కేకే సర్వేకు భారీ షాక్ ఇచ్చింది! తమ సర్వే చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, ఈ సంస్థ అంచనాలు పూర్తిగా బూమరాంగ్ అయ్యాయి. కేకే సర్వే విడుదల చేసిన ప్రీ-పోల్, ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ జూబ్లీ హిల్స్‌లో బీఆర్‌ఎస్‌కే విజయావకాశాలు ఉన్నాయని, కాంగ్రెస్‌కి అవకాశం లేదని ఘంటాపథంగా చెప్పాయి. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్‌లో అయితే... బీఆర్‌ఎస్‌కు ఏకంగా 49 శాతం ఓట్లు వస్తాయని, కాంగ్రెస్‌కి 41 శాతం మాత్రమే దక్కుతాయని ధీమా వ్యక్తం చేసింది. కానీ, పోలింగ్ ముగిసి ఈవీఎంలు తెరిచిన తరువాత సీన్ మొత్తం రివర్స్ అయింది! కేకే సర్వే అంచనాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా, ప్రజల నాడిని పసిగట్టడంలో ఘోరంగా విఫలమై, ఇక్కడ బీఆర్‌ఎస్ పార్టీ భారీ తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.

జూబ్లీ హిల్స్ ఓటర్ల తీర్పు కేకే సర్వే లెక్కలను చీల్చి చెండాడింది అనడంలో అతిశయోక్తి లేదు. సర్వే ఇచ్చిన లెక్కలకు, వాస్తవ ఫలితానికి మధ్య ఇంత భారీ వ్యత్యాసం ఉండటంపై సర్వత్రా చర్చ మొదలైంది. వివాదం... ఎన్నికల సంఘానికి ఫిర్యాదు! సర్వే ఫలితం తారుమారు కావడం ఒక ఎత్తైతే, ఎన్నికల కోడ్ అమలులో ఉండగా బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఫలితాలు ఉంటాయని ప్రీ-పోల్ సర్వే విడుదల చేయడంపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బలమూరి వెంకట్ ఏకంగా దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. ఓటర్లను తప్పుదోవ పట్టించడానికి ఈ సర్వే ప్రయత్నించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఇక‌ గతంలో 2024 ఎన్నికల ముందు కచ్చితత్వంతో కూడిన ఫలితాలను చెప్పి పేరు తెచ్చుకున్న ఈ సంస్థ, ఆ తర్వాత నుంచి తన విశ్వసనీయతను కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమవుతోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా కేకే సర్వే అంచనాలకు భిన్నంగా వచ్చాయి. మరి ఈ తాజా జూబ్లీ హిల్స్ పరాజయం తరువాత, తెలుగు రాజకీయ వర్గాల్లో కేకే సర్వే అంటే గతంలో ఉన్న ఆసక్తి, నమ్మకం తగ్గిపోతుందా? లేక ఇది కేవలం ఒక లోకల్ ఎలక్షన్ ఫెయిల్యూర్ మాత్రమేనా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న! క్రెడిబిలిటీ పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవడం కష్టమే మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: