ఇలా ప్రతి సంవత్సరం ఆయుధ పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఆయుధ పూజను ఎందుకు జరుపుకుంటారు.. ఎందుకని దీనికంత ప్రాముఖ్యత ఇస్తారనే విషయాలపై కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...పురాణాల ప్రకారం పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లడానికి ముందు జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను భద్రపరిచారు. అర్జునుడు గాండీవంతో పాటు భీమసేనుని గదాయుధానికి యుద్ధానికి వెళ్లడానికి ముందు ప్రత్యేకంగా పూజలు జరిపించారు. అలా వారు శక్తి స్వరూపిణిని ప్రసన్నం చేసుకుని, పాండవులు యుద్ధానికి సన్నద్ధం అయ్యారని చెబుతుంటారు.
మరోవైపు దుర్గతులను నివారించే మహా స్వరూపిణి అమ్మవారైన దుర్గాదేవి దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించిన రోజు అని చెబుతారు. పంచప్రక్రుతి మహా స్వరూపాలలో దుర్గావేది మొదటిది. బవబంధాల్లో చిక్కుకున్న వ్యక్తులను అమ్మవారు అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మవారిని ఈరోజు స్మరించుకుంటే.. శత్రు బాధలు తొలగిపోతాయని చాలా మంది నమ్మకం.ఆయుధ పూజ రోజున ‘ఓం దుం దుర్గాయైనమః' అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలొస్తాయి. అలాగే లలిత అష్టోత్తరాలు పఠించాలి. ఆ తర్వాత ఆయుధ పూజ లేదా అస్త్రపూజలు చేయాలి.