ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన తొలి వన్డేలో గాయపడిన టీమిండియా మిడిలార్డర్ యువ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ శస్త్ర చికిత్స విజయవంతమైంది. భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైందని, త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతానని శ్రేయాస్ తెలిపాడు. ఈ మేరకు తన సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. సర్జరీ అనంతరం హాస్పిటల్‌ బెడ్‌పై కూర్చుని ఉన్న ఫొటోను ఆ పోస్ట్ లో షేర్‌ చేశాడు. ‘సర్జరీ సక్సెస్‌.. ధృడసంకల్పంతో అతి త్వరలోనే తిరిగి వచ్చేస్తాను. మీ అందరి విషెస్‌కు కృతజ్ఞతలు’ అని శ్రేయస్ పేర్కొన్నాడు.

కాగా, శ్రేయస్‌.. గాయం కారణంగా ఇంగ్లండ్‌ వన్డే సిరీస్‌తో పాటు ఐపీఎల్‌ 2021 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అయ్యర్.. లీగ్‌ మొత్తానికి దూరం కావడంతో ఢిల్లీ ఫ్రాంచైజీ ఆందోళన చెందింది. ఈ క్రమంలోనే అతని స్థానంలో టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌ రిషబ్‌ పంత్‌ను కెప్టెన్ గా ఎంపిక చేసింది. ఆసీస్ ఒకప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆజింక్య రహానే వంటి సీనియర్లున్నప్పటికీ పంత్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పటించడానికే ఢిల్లీ ఫ్రాంచైజీ మొగ్గు చూపింది. ఈ ఎంపికను ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ కూడా సమర్థించాడు. టీమిండియా మాజీలు కూడా పంత్ కెప్టెన్సీ నిర్వహించగలని అభిప్రాయపడ్డారు. మరి వీరి నమ్మకాన్ని పంత్ ఏ స్థాయిలో నిలబెడతాడో చూడాలి.

ఇదిలా ఉంటే ఈ ఏడాది సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్‌ 10న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది. గురువు ధోనీ కెప్టెన్సీలోని చెన్నైతో శిష్యుడు రిషబ్ పంత్ జట్టు ఢిల్లీ పోటీ పడుతుండడం అభిమానుల్లో తీవ్ర ఉత్సుకతను రేకెత్తిస్తోంది. మరి ఈ మ్యాచ్‌లో గురువుగా ధోనీ గెలుస్తాడో, లేక గురువుని మించిన శిష్యుడిగా పంత్ నిరూపించుకుంటాడో తెలియాలంటే మరొక్క రోజు వేచి చూడక తప్పదు.



మరింత సమాచారం తెలుసుకోండి: