టీ 20 ప్రపంచ కప్ 2021 షెడ్యూల్ ప్రకారం సూపర్ 12 లో భారత్ మరియు పాకిస్తాన్ లు నిన్న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి మ్యాచ్ ఆడారు. మ్యాచ్ ముందు వరకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. అదేదో రెండు దేశాల మధ్యన జరుగుతున్న యుద్ధంలా పెద్ద సీన్ చేశారు. ఈ మ్యాచ్ పై ప్రతి ఒక్కరూ ఇండియానే గెలుస్తుందని అనుకున్నారు. ఆఖరికి టీమిండియా కూడా ఈ మ్యాచ్ పై పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగింది. అయితే మ్యాచ్ మొదలైన సమయం నుండి అందరి అంచనాలు తలక్రిందులు అయిపోయాయి. పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. అక్కడే సగం మ్యాచ్ పాకిస్తాన్ గెలిచినట్లయింది. ఇక మ్యాచ్ మొత్తం పాకిస్తాన్ తన ఆధిపత్యాన్ని చూపించింది. ఇండియా ఇన్నింగ్స్ 151 పరుగుల వద్ద ముగిసింది. కెప్టెన్ కోహ్లీ మరియు వికెట్ కీపర్ పంత్ మినహా ఎవ్వరూ ఆకట్టుకోలేక కోట్లాది మంది అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. చేజింగ్ కు వచ్చిన పాకిస్తాన్ ఏ దశలోనూ ఇండియాకు అవకాశం ఇవ్వలేదు. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని సునాయాసంగా చేధించారు. అయితే ఈ మ్యాచ్ లో ఇండియా చేసిన తప్పులేమిటో ఓసారి చూద్దాం.

* మొదట బ్యాటింగ్ కు వచ్చిన ఇండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఒక మంచి ఇన్ స్వింగర్ యార్కర్ ను అంచనా వేయలేక రోహిత్ శర్మ వికెట్ల ముందు దొరికి పోయాడు. మొదటి ఆరు ఓవర్లు బ్యాట్స్ మన్ కు చుక్కలు కనిపించాయి. అయితే ఆచితూచి ఆడకుండా రాహుల్ కూడా క్లిన్ బౌల్డ్ అయ్యాడు.

* పిచ్ బౌలర్లకు సహకరిస్తున్న సమయంలో బ్యాటింగ్ నెమ్మదిగా చేయాల్సింది. కానీ పిచ్ ను అంచనా వేయలేక మూడు కీలక వికెట్లు కోల్పోయింది ఇండియా. మరో వైపు కోహ్లీతో జత కలిసిన పంత్ ఎప్పటిలాగే రెండు సిక్సర్ లు బాది అనవసర షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కనీసం 15 ఓవర్ల వరకు మరో వికెట్ పడకుండా ఆడి ఉంటే ఇంకో 20 నుండి 30 పరుగులు సాధించే అవకాశం ఉండేది.

* ఇక జడేజా కన్నా ముందు హార్దిక్ ను పంపి ఉంటే అతను కుదురుకోవడానికి సమయం ఉండేది. తన హిట్టింగ్ స్కిల్స్ ఉపయోగపడేవి. కానీ జడేజా రావడంతో ఆ సమయం అంత వేస్ట్ అయింది. ఇక హార్దిక్ వచ్చే లోగా 2 ఓవర్లు ఉన్నాయి. ఎప్పటిలాగే ఒకటి రెండు షాట్ లకే పరిమితం అయ్యి పెవిలియన్ చేరాడు.

* ఇక ఆ తర్వాత బౌలర్లు ఒక్క షాట్ సరిగా ఆడలేక 151 పరుగులకు పరిమితం అయింది, టీమిండియా బౌలర్ లలో శార్దూల్ ఠాకూర్ ఉండి ఉంటే తన అల్ రౌండ్ ప్రతిభ యూజ్ అయ్యేది.

* అయితే 152 పరుగుల లక్ష్యం ఏమంత సులభం కాదు. మొదటి పవర్ ప్లే లో వికెట్లు తీస్తే పాకిస్తాన్ పై ఒత్తిడి పెరిగేది. కానీ మనకున్న బౌలర్లు కనీసం ఒక్క వికెట్ తీయలేకపోయారు. క్రీజులో ఉన్న ఇద్దరు ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడారు.


* టీమిండియా బౌలర్లు ఎంత సేపు మిడిల్ స్టంప్, లెగ్ స్టంప్ పైనే బంతులు వేస్తూ రిజ్వాన్ కు బాగా హెల్ప్ చేశారు. ఒకరు కూడా ఆఫ్ స్టంప్ అవతల బంతులు వేయలేకపోయారు. ఇక మిస్టరీ స్పిన్నర్ గా జట్టులోకి వచ్చిన వరుణ్ చక్రవర్తి సైతం తేలిపోయాడు. జడేజా ఐపీఎల్ లో రాణించినా ఇక్కడ ఫెయిల్ అయ్యాడు.

* ఇప్పుడు అయినా సెలెక్టర్లు ఒక విషయం గుర్తించుకోవాలి. టీ 20 లలో జట్టులో ఎక్కువ మంది అల్ రౌండర్ లు ఉండడం చాలా ముఖ్యం. ఒకవేళ జట్టులో శార్దూల్ ఠాకూర్ ఉంటే బౌలింగ్ బ్యాటింగ్ లో ఉపయోగపడి ఉండొచ్చు. హార్దిక్ ఇంకా ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్నట్లు అనిపించింది. ఎంతో అనుభవం ఉన్న అశ్విన్ తుది జట్టులో ఉండుంటే బాగుండేది.

అయితే ఈ జట్టు కూర్పులో పూర్తిగా కోహ్లీ మరియు రవిశాస్త్రి నిర్ణయమని తెలుస్తోంది. జట్టు మెంటార్ గా ఉన్న ధోని సలహాలు తీసుకున్నారో లేదో తెలియదు. మరి ముందు మ్యాచ్ లలో అయినా ఈ తప్పులను సరిదిద్దుకుని సెమీఫైనల్ లో స్థానాన్ని దక్కించుకుంటుందో లేదో చూడాలి.  
 


మరింత సమాచారం తెలుసుకోండి: