ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరంగా భావించే సముద్ర తీర ప్రాంతం ఇప్పుడు మరింత విపత్తుగా మారే పరిస్థితిలో ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం బలమైన వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం అండమాన్ నికోబార్ దీవులకు 510 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకు 890 కిలోమీటర్ల, విశాఖపట్నానికి 920 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాతావరణ శాఖ అధికారులు అంచనా ప్రకారం, ఈ వాయుగుండం ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా, సోమవారం ఉదయానికి నైరుతి – పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత సోమవారం అర్థరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున ఉత్తర వాయువ్య దిశలో కదులుతూ, మచిలీపట్నం – కళింగపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.
 

బుధవారం ఉదయం నుంచి తుపానుగా బలహీనపడేలా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న మూడు రోజుల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే వీలున్నందున, రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. విశాఖపట్నం, మచిలీపట్నం, క్రిష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు ఒకటో స్థాయి హెచ్చరికలు ప్రకటించబడ్డాయి. తుపానుగా తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఆదివారం రోజున, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం బాపట్ల, ప్రకాశం,నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.



ఇక‌ ఇదే విధంగా అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు. మంగళవారం రోజున రాయలసీమ, కోస్తా, గోదావరి మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ప్రజలు, అధికారులు, రైతులు, మరియు ఆందోళన కలిగించే ప్రాంతాల్లోని వాహన సవారీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మొంథా తుపానా ప్రభావం మూడు రోజులు కొనసాగుతుందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: