బంగాళాఖాతంలో ఏర్పడిన 'మెంథా' అతిభయంకర తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌ను భయపెడుతోంది. కోస్తాంధ్రపై విరుచుకుపడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, హైఅలర్ట్ ప్రకటించింది. ఈ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పలు ముఖ్య కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. అమరావతిలో బ్యాంకుల శంకుస్థాపన వాయిదా.. ఈ నేపథ్యంలోనే, రాజధాని అమరావతిలో ఈ నెల 28న ప్రతిష్ఠాత్మకంగా చేపట్టదలిచిన 12 జాతీయ బ్యాంకుల రాష్ట్ర కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని తుఫాన్ కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది.


అమరావతి 2.0 నిర్మాణ పనుల వేగం .. ప్రధాని మోదీ చేతుల మీదుగా మే నెలలో పునఃప్రారంభించిన తర్వాత అమరావతి 2.0 పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఆర్డీఏ పరిపాలన భవనం నిర్మాణం పూర్తి కాగా, హోటళ్లు, విద్యాసంస్థల పనులు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు విరామం లేకుండా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే, రాజధానిలోని ఉద్దండరాయునిపాలెం వద్ద ఒకేచోట 12 జాతీయ బ్యాంకుల రాష్ట్ర కార్యాలయాల నిర్మాణానికి ముహూర్తం నిర్ణయించారు.గతంలో వెనకడుగు వేసిన బ్యాంకులు .. 2014-19 మధ్య కాలంలోనే ఈ 12 జాతీయ బ్యాంకులకు రాజధాని అమరావతిలో భూములు కేటాయించినా, 2019లో ప్రభుత్వం మారిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనతో బ్యాంకులు నిర్మాణ పనులకు వెనకడుగు వేశాయి. భూములను స్వాధీనం చేసుకోలేకపోయాయి.



కూటమి ప్రభుత్వంలో పునఃప్రారంభం .. గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణంపై శ్రద్ధ వహించడంతో, బ్యాంకులతో సంప్రదింపులు ఫలించి, నిర్మాణాలకు సిద్ధమయ్యాయి. ఎస్బీఐకి 3 ఎకరాలు కేటాయించారు. అక్కడ 14 అంతస్థుల్లో ఎస్బీఐ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించనుంది. కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకు, ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రధాన బ్యాంకులన్నీ ఉద్దండరాయుని పాలెంలో తమ కార్యాలయాలను నిర్మించనున్నాయి. రాజధాని ప్రాంతంలో బ్యాంకులు అన్నీ ఒకేచోట ఉండటం వల్ల ప్రజలకు సౌలభ్యం కలుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. తుఫాన్ ముప్పు తొలగగానే ఈ కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: