రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న రాష్ట్రాలలో ఏపీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో అధికారులు, ఆరోగ్యశాఖ మంత్రితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య మంత్రి అధికారులతో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో సీఎం జగన్ మాట్లాడతూ... టీచర్లు సహా, స్కూళ్లలో పని చేస్తున్న సిబ్బంది అందరికీ వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. త్వరలో పాఠశాలలు తెరవబోతున్న నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అంతే కాకుండా గ్రామాల యూనిట్గా వ్యాక్సినేషన్ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలా చేస్తే వ్యాక్సిన్లు వృథా కాకుండా మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చని సీఎం సూచించారు. 18–44 ఏళ్ల మధ్యనున్న వారికి కూడా వ్యాక్సిన్లు ఇవ్వటానికి వెంటనే కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా ప్రజలతో సంబంధాలు ఉండే ఉద్యోగులు, సిబ్బందికి వ్యాక్సినేషన్ లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. గ్రామాల్లో కాలుష్యంపై దృష్టి పెట్టాలని....నీరు, గాలి, మట్టి నమూనాలను పరిశీలించి కాలుష్య స్థాయిలపై తగిన వివరాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
శానిటేషన్ పరిస్థితుల పై కూడా వివరాలు నమోదు కావాలని ....ఈ ప్రోటోకాల్స్ను పటిష్టంగా రూపొందించాలని సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. విలేజ్ క్లినిక్స్ నుండి టీచింగ్ ఆస్పత్రుల వరకూ అవసరమైన సిబ్బంది పై దృష్టి పెట్టాని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జిల్లా యూనిట్ గా మూడు నెలల్లోనే రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని తెలిపారు. ఉద్యోగంలోకి తీసుకున్న సిబ్బంది సేవలను మెరుగ్గా ప్రజలకు అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతే కాకుండా ట్రైబల్ ప్రాంతాల్లో వైద్య సేవల పై పర్యవేక్షణ ఉండాలని సీఎం అధికారులకు చెప్పారు. పీహెచ్సీ నుండి పై స్థాయి ఆస్పత్రుల వరకు కాంపౌండ్ వాల్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.