వంటింటికే పరిమితం అయిన ఆడవాళ్లు ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. తమ కాళ్ల మీద వారు నిలబడుతున్నారు. అన్ని రంగాల్లో మహిళలలు ప్రధానంగా కనిపిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బిజినెస్లో మహిళల ప్రాతినిద్యం పెరుగుతోంది. ఆడవాళ్లు వ్యాపారంలో నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం అలాంటిది. వ్యాపారాన్ని అభివృద్ది చేసి ముందుకు సాగడం అనేది సవాళ్లతో కూడుకున్న విషయం. ఇలాంటి క్రమంలో ఓ మహిళా తన వ్యాపారంలో విజయం సాధించడమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతురాలిగా మారింది.
ఇటీవల వెల్త్ హరున్ ఇండియా రిచ్ లిస్ట్ - 2021 జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీమంతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనిక మహిళగా ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ -ఈ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ 44 ఏళ్ల మహిమా దాట్లా నిలిచింది. ఆమె నికర సంపద విలువ రూ.7,700 కోట్లు గా ఉంది. మొత్తం భారతదేశం లోని సంపన్నుల జాబితాలో 231వ ర్యాంకు సాధించారు మహిమా దాట్లా.
లండన్ లోని వెబ్ స్టర్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్ మెంట్ లో మహిమా దాట్లా బ్యాచిలర్ డిగ్రీ పొందారు. 2001 నుంచి బయోలాజికల్-ఈ బాధ్యతలు స్వీకరించారు. మహిమా తాతలు 1948లో స్థాపించిన బయోలాజికల్ ప్రొడక్ట్ లిమిటెడ్ సంస్థ రక్తం గడ్డకట్టకుండా నిరోధించడానికి 'హెపారిన్' అనే ఔషధాన్ని మొదటిసారిగా తయారు చేసింది. ప్రస్తుతం ఇదే సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు మహిమ.
ఈ ఏడాది హరున్ ఇండియా రిచ్ లిస్ట్ లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన 69 మంది వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. ఇండియా రిచ్ లిస్ట్ లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న వారి సంపద రూ.3,79,200 కోట్లుగా ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 54 శాతం పెరిగింది.