భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం కామన్ ఇలాంటి గొడవలు జరిగినప్పుడు  భార్య భర్తల బంధం మరింత బలపడుతుంది అని చెబుతూ ఉంటారు పెద్దలు. కానీ ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలు ఎన్నో దారుణాలకు కారణం అవుతున్నాయి . ఒకరోజు గొడవపడి మరోరోజు కలిసిపోయే భార్య భర్తలు నేటి రోజుల్లో మాత్రం చిన్నచిన్న గొడవలను పట్టుకుని పాకులాడుతూ చివరికి సంసారాన్ని చేతులారా పాడు చేసుకునే ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఏకంగా మూడు ముళ్ళ బంధంతో ఒక్కటై కలకాలం తోడునీడగా ఉంటానని ప్రమాణం చేసిన వారే కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చిన ఘటన సమాజానికి ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.



 ఇక్కడ భార్య భర్తల మధ్య తలెత్తిన చిన్న గొడవ దారుణానికి దారితీసింది. చిలికి చిలికి గాలివానలా మారి చివరికి ఒకరి ప్రాణాలు పోవడానికి కారణం అయింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల గ్రామం లో వెలుగులోకి వచ్చింది. ఉప్పట్ల గ్రామానికి చెందిన రేణుక అదే గ్రామానికి చెందిన వ్యక్తితో కొన్నేళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరి సంసారం  కొన్ని సంవత్సరాలపాటు ఎంతో సాఫీగా సాగిపోయింది. తర్వాత వీరి మధ్య గొడవలు జరగడం మొదలయ్యాయి. ఒకరిని ఒకరు దారుణంగా తిట్టుకునేవారు. ఇక వీరి మధ్య గొడవలు ఏకంగా ఊరి పెద్దల వరకు వెళ్లాయి.


 ఇద్దరికీ సర్ది చెప్పిన ఊరి పెద్దలు గొడవలు పడకుండా జీవించాలి అంటూ సూచించారు. అయితే గొడవ పంచాయితీ వరకు వెళ్లడంతో భార్య తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు భర్త. ఇక భార్య తన మాట వినటం లేదని ఇంకా కోపం పెరిగి పోయింది. ఈ క్రమంలోనే ఒక బండరాయి చేతిలో పట్టుకుని ఆమె వెంటపడ్డాడు. పరుగులు పెడుతున్న సదరు మహిళను పట్టుకొని నడిరోడ్డుపై పట్టపగలే బండరాయితో తల మీద కొట్టి ప్రాణాలు తీశారు. ఈ ఘటన స్థానికంగా అందరినీ భయబ్రాంతులకు గురి చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: