తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో చంద్రబాబు వెళ్లిన రూట్లోనే వెళ్తున్నారా అన్న అనుమానం వస్తోంది. ఏ విషయంలో అంటారా.. కేంద్రంపై పోరాటం అంశంలో. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తొలి మూడేళ్లు కమలం పార్టీతో బాగానే కాపురం చేశారు. కేంద్రంలో పదవులు తీసుకున్నారు. ఏపీ సర్కారులో బీజేపీ మంత్రులకూ పదవులు ఇచ్చారు. రెండేళ్లు సాఫీగానే సంసారం సాగింది. అయితే.. గతంలో కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు ఆ తరహాలో మోడీ దగ్గర తన మాటలు చెల్లుబాటుకాకపోవడంతో బీజేపీతో కయ్యం ప్రారంభించారు.


ఆ కయ్యం కాస్తా 2019 ఎన్నికల ముందు నాటికి యుద్ధంగా మారింది. ఏపీని కేంద్రం ముంచేసింది.. కేంద్రంపై పోరాటం చేద్దామంటూ ఏకంగా చంద్రబాబు కాంగ్రెస్‌తోనూ చేతులు కలిపారు. అయితే ఈ ఎత్తుగడ ఘోరంగా విఫలమైంది. పూర్తిగా బెడిసి కొట్టింది.. ఇప్పుడు కేసీఆర్ వ్యవహారం కూడా చంద్రబాబు వ్యూహాన్ని గుర్తుకు తెస్తోంది. కేసీఆర్ చంద్రబాబు రేంజ్‌లో కేంద్రంతో కాపురం చేయకపోయినా.. అనేక విషయాల్లో కేంద్రానికి కేసీఆర్ బేషరతుగా మద్దతు ఇచ్చారు. అనేక బిల్లుల విషయంలో సహకరించారు.


కానీ.. ఇప్పుడు కేసీఆర్ కేంద్రం అంటేనే మండిపడుతున్నారు. కేంద్రం తెలంగాణను మోసం చేస్తోందని... గతంలో చంద్రబాబు తరహాలోనే విమర్శలు చేస్తున్నారు. అయితే మరి చంద్రబాబుకు కేంద్రంతో యుద్ధం అనే అంశం కలసిరాలేదు. రెండున్నరేళ్లు కలసి కాపురం చేసి క్లయిమాక్స్‌లో కేంద్రంపై పోరాటం అనడంతో జనం నమ్మలేదు. కానీ.. కేసీఆర్ బాబు తరహాలో కలసి కాపురం చేయలేదు. రైతుల కోసం అంటూ ఇప్పుడు కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తున్నారు.


అయితే.. కేంద్రం తెలంగాణను మోసం చేస్తోందన్న వాదనలోనూ పూర్తిగా బలం కనిపించడం లేదు.. రైతులపై ప్రేమ కంటే.. రాజకీయ వ్యూహమే ఎక్కువగా కనిపిస్తోంది. మరి చంద్రబాబు ఫెయిలైన చోట కేసీఆర్ గెలుస్తారా.. కేంద్రంపై యుద్ధం అనే కాన్సెప్టు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను మూడోసారి గెలిపిస్తుందా.. చూడాలి.. ఏం జరుగుతుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: