దుబాయి: కరోనా కారణంగా చాలా నెలల పాటు సినిమా నటులకు కుటుంబంతో గడిపే సమయం లభించింది. ఇక కొద్ది నెలల నుంచి మళ్లీ షూటింగ్‌లకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పేయడంతో ఒక్కో నటుడు తమ తమ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో పడ్డారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. గీత గోవిందం వంటి సూపర్ హిట్ చిత్రం తీయడంతో పరశు రామ్‌కు తదుపరి చిత్రం మహేష్ బాబుతో తీసే అవకాశం దక్కింది. దీంతో ఈ ప్రాజెక్టును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

మహేష్ బాబును సరికొత్త లుక్‌లో చూపిస్తున్నారు. ఇక ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని మహేష్ బాబు అభిమానులు ఎదురుచూశారు. వారి ఎదురు చూపుకు సమయం వచ్చింది. మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్ర షూటింగ్ కోసం దుబాయి పయనమయ్యాడు. మరో విశేషమేంటంటే.. శుక్రవారం మహేష్ బాబు భార్య నమ్రత ఘట్టమనేని పుట్టినరోజు కూడా. దీంతో ఒకపక్క షూటింగ్‌ పనుల్లో పాల్గొనడమే కాకుండా మరోపక్క నమ్రత పుట్టిన రోజు వేడుకలను కూడా దుబాయిలోనే జరపనున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు.

నమ్రత పుట్టిన రోజు వేడుకలు పూర్తి కాగానే ఆమె, తన ఇద్దరు పిల్లలతో తిరిగి హైదరాబాద్ వచ్చేయనున్నారు. మహేష్ బాబు మాత్రం సర్కారు వారి పాట షూటింగ్‌లో హాజరై ఆ షూటింగ్‌ను పూర్తి చేసుకుని తిరిగి వస్తాడు. సర్కారు వారి పాట షూటింగ్ నెల రెజుల పాటు దుబాయిలోనే జరగనుంది. దుబాయిలో ఈ చిత్ర కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు కూడా వరుస సినిమాలను లైన్‌లో పెట్టేస్తున్నారు. సర్కారు వారి పాట చిత్రం తరువాత ఆయన దర్శక ధీరుడు రాజమౌళితో ఒక సినిమా చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మహేష్ బాబు ప్రాజెక్టు మీదే రాజమౌళి ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: