ఇంటర్నెట్ డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు హీరోగా మంచి గుర్తింపు నిచ్చిన చిత్రం ఛత్రపతి. టాలీవుడ్ మయిస్ట్రో రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రభాస్‌ను స్టార్ హీరోను చేసింది. అభిమానులకు దగ్గర చేసింది. శ్రీలంక నుంచి అక్రమంగా పారిపోయి మార్గం మధ్యలో విడిపోయిన ఓ పిల్లవాడు ఎలా ఎదిగాడు..? తను ఎంతగానే ఆరాధించే తన తల్లిని ఎలా చేరుకున్నాడు..? అది నచ్చని తమ్ముడు అతడిని ఎలా అడ్డుకున్నాడనేదానిపై సినిమా నడుస్తుంది. శ్రియ అందం సినిమాకు మరింత గ్లామర్‌ అద్దింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు ఈ రీమేక్‌తో తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. అంతేకాదు ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో తెలుగు డైరెక్టర్ వీవీ వినాయక్‌ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు గుర్తింపు పొందిన పాత్ర అతడి తమ్ముడిది. షఫీ ఈ పాత్రలో అద్భుతంగా నటించాడు. ‘నీ అమ్మ కాదురా..! నా అమ్మ. వసకొల్లా’ అంటూ అతడు చెప్పే డైలాగ్‌లు సినిమాకే హైలెట్ అనడంలో అతిశయోక్తి లేదు. ఛత్రపతి సినిమా మొత్తం అమ్మ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అమ్మ ప్రేమ కోసమే హీరో తపించిపోతుంటాడు. అలాంటి అమ్మ పాత్రను తెలుగులో భానుప్రియ పోషించారు.

ఇలాంటి కీలక రోల్స్‌ను బాలీవుడ్‌లో ఎవరితో వేయించాలా..? అని దర్శక, నిర్మాతలు ఇన్నాళ్లూ తలలు పట్టుకున్నారట. అయితే తల్లి పాత్ర గురించి మాత్రం చివరకు ఓ నిర్ణయానకి వచ్చారట. తాజా సమాచారం మేరకు భానుప్రియ పాత్రలో నటి షెఫాలీ షా నటించనున్నారట. ఇటు సినిమాలు, అటు సీరియల్స్‌లో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న షెఫాలీ షా ఇటీవల ప్రేక్షకుల మెప్పును పొందిన వెబ్‌ సిరీస్‌ 'ఢిల్లీ క్రైమ్‌'లోనూ నటించారు. ఇక తమ్ముడి పాత్రలో ఎవరు నటిస్తారనే విషయం మాత్రం తేలాల్సి ఉంది. అయితే ఈ పాత్రలో షఫిని చూసిన తెలుగు ప్రేక్షకులు మాత్రం అతడే మళ్లీ ఈ పాత్ర చేయాలని కోరుకుంటున్నారు. మరి చిత్ర బృందం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: