తాజాగా విడుదలైన రెండు ప్యాన్ ఇండియా సినిమాలు వార్ 2, కూలీ ఊహించినంత స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోతే… ఇరవై రోజులు దాటేసిన మహావతార్ నరసింహ మాత్రం కొత్త ఊపిరి పీలుస్తోంది. రిలీజ్ సమయంలోనే యానిమేషన్ సినిమాలో ఇంత క్రేజ్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఇచ్చిన అద్భుతమైన రెస్పాన్స్‌తో 200 కోట్ల గ్రాస్‌ను దాటేసింది. ఇప్పుడు లాంగ్ వీకెండ్ దొరకడంతో మళ్ళీ ఒకే రేంజ్ లో రెచ్చిపోతోంది. ఏపీ పరిస్థితి చూస్తే గమ్మత్తుగా ఉంది. తారక్, రజని సినిమాలకి టికెట్ రేట్లు పెరగడం వల్ల సాధారణ ప్రేక్షకులు డబ్బు ఆదా చేసుకోవాలని చూస్తున్నారు. అందుకే తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్న మహావతార్ నరసింహకే వెళ్లిపోతున్నారు.


తెలంగాణలో పరిస్థితి వేరేలా ఉన్నా స్క్రీన్లు తగ్గినా హౌస్ ఫుల్ షోలు, అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. బుక్ మై షోలో రోజూ 10 నుంచి 15 వేల టికెట్లు అమ్ముడవ్వడం దీని పాపులారిటీకి నిదర్శనం. ట్రేడ్ సర్కిల్స్ చెప్పే లెక్కల ప్రకారం, ఇంకో 100 కోట్లు ఈజీగా దాటేస్తుందని ఖచ్చితంగా చెబుతున్నారు. ఇప్పటికే కూలీకి మిక్స్డ్ టాక్, వార్ 2కి డిజాస్టర్ టాక్ రావడంతో ప్రేక్షకుల దగ్గర బెస్ట్ ఆప్షన్ నరసింహగానే మారింది. శని, ఆదివారాల్లో ఎక్కువ సెంటర్లలో షోలు పెంచేస్తున్నారంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. కొత్త సినిమాల షోలు తగ్గించి పాతదానికి పెంచడం అనేది ఈ మధ్యకాలంలో వినని విషయం. మరి ఇక్కడితో ఆగిపోతుందా అంటే కాదు.


మధ్యలో పెద్దగా రిలీజులు లేకపోవడం, రవితేజ మాస్ జాతర వాయిదా పడే అవకాశాలు ఉండటం వల్ల ఆగస్ట్ నెలాఖరు వరకు నరసింహ రన్ ఆగే అవకాశం లేదని ట్రేడ్ ఫిక్స్ అయ్యింది. యానిమేషన్ రంగంలో ఇది రివల్యూషన్ క్రియేట్ చేసింది. ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్, మొదట స్టార్ హీరోతో లైవ్ యాక్షన్ ఫాంటసీ మూవీ ప్లాన్ చేసి, ఇప్పుడు ఆ ఐడియా డ్రాప్ చేసి, పూర్తిగా యానిమేటెడ్ క్యారెక్టర్స్ తోనే సినిమాను తీయాలని నిర్ణయించుకోవడం నరసింహ ప్రభావం ఎంత ఉందో చూపిస్తోంది.సరైన కంటెంట్, కొత్తదనం ఉంటే యానిమేషన్ సినిమాలు కూడా బాక్సాఫీస్ మీద మాస్ బ్లాక్‌బస్టర్స్ సాధిస్తాయని మహావతార్ నరసింహ నిరూపించింది. ఇక ఈ ఊపుతో దూసుకుపోతే, తెలుగు సినిమా చరిత్రలో ఇది ఒక మైలురాయి కావడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: