ప్రతి సంవత్సరం ఐఎమ్‌డిబి(IMDb) ప్రకటించే మోస్ట్ పాపులర్ ఇండియన్ డైరెక్టర్స్ లిస్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. నెలకు 250 మిలియన్లకుపైగా యూజర్లు సందర్శించే ఈ ప్లాట్‌ఫార్మ్, పేజ్ వ్యూస్ ఆధారంగా ఈ ర్యాంకింగ్‌ను రూపొందిస్తుంది. కానీ 2025 లిస్ట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేసిన పెద్ద షాక్ ఏంటంటే… టాప్ 10లో ఒక్క టాలీవుడ్ డైరెక్టర్ కూడా లేకపోవడం.

 2025 సంవత్సరానికి గాను మోస్ట్ పాపులర్ ఇండియన్ డైరెక్టర్స్ జాబితాను ఐఎమ్‌డిబి తాజాగా రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో బాలీవుడ్ దర్శకుడు మోహిత్ సూరి అగ్ర‌స్థానం ద‌క్కించుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ఈయ‌న డైరెక్ట్ చేసిన ‘సయ్యారా’ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో ఐఎమ్‌డిబి పేజ్‌వ్యూస్ అతని వైపు భారీగా వెల్లువెత్తాయి. అయితే మోహిత్ సూరి కంటే ఎక్కువ అటెన్షన్ దొరుకుతున్నది రెండో స్థానంలో నిలిచిన ఆర్యన్ ఖాన్‌కే. కేవలం 28 ఏళ్ల వయసులో, తన తొలి ప్రాజెక్ట్ ‘ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్ సిరీస్‌తోనే ఐఎమ్‌డిబి టాప్-2లోకి రావడం ఒక సెన్సేషన్‌గా మారింది. ఈ లిస్ట్‌లో అతి పిన్న వయస్కుడిగానే కాకుండా, ఒక్క వెబ్ సిరీస్‌తో టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక డైరెక్టర్ కూడా అతడే కావడం విశేషం.

కోలీవుడ్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్ ఈసారి కూడా తన ప్రభావాన్ని నిలబెట్టుకున్నాడు. ‘కూలీ’ సినిమా విడుదల అనంతరం వచ్చిన పాపులారిటీ అత‌డికి మూడో స్థానం ద‌క్కేలా చేసింది. తమ ప్రత్యేక శైలి, కథలతో అనురాగ్ కశ్యప్, పృథ్వీరాజ్ సుకుమారన్ నాలుగు, ఐదు స్థానాల‌ను సొంతం చేసుకున్నాడు. ఆర్.ఎస్. ప్రసన్న, అనురాగ్ బాసు, డొమినిక్ అరుణ్, లక్ష్మణ్ ఉటేకర్, నీరజ్ ఘైవాన్ ఆ త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా టాప్-10లో నిలిచారు. అయితే ఈ లిస్ట్ లో టాలీవుడ్ జీరోగా ఉండ‌టం తెలుగు సినీ ప్రియుల‌ను క‌ల‌వ‌ర‌ప‌రిచింది.

అయితే ఇందుకుగ‌ల కార‌ణాల‌ను సినీకళాకారులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ ఐనప్పటికీ, ఐఎమ్‌డిబి గ్లోబల్ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించే స్థాయిలో టాలీవుడ్ అవుట్‌పుట్ కనిపించలేదని అంటున్నారు. పాన్ ఇండియా రిచ్ సాధించిన సినిమాలు ఉన్నప్పటికీ, డైరెక్టర్ల వ్యక్తిగత గుర్తింపు ఐఎమ్‌డిబి లెక్కల్లో అంతగా వెలగలేదని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: