ఎవ‌రైనా... ఏ రాజ‌కీయ నాయ‌కుడైనా.. త‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కంటూ... గుర్తింపు ఉండాల‌ని కోరుకుంటారు.. త‌న పేరు చిర‌స్థాయిగా నిలిచిపోవాల‌ని అనుకుంటారు. ఈ క్ర‌మంలో అనేక మంది నాయ‌కులు... త‌మ త‌మ ప్రాంతాల్లో కీల‌క ప్రాజెక్టుల‌ను చేప‌ట్టి.. త‌మ పేరు చెరిగిపోకుండా చూసుకున్నారు. ఆ పార్టీ ఈపార్టీ అనే తేడా లేకుండా ప్ర‌తి పార్టీలోనూ ఈ త‌ర‌హా నాయ‌కులు ఉన్నారు. అందుకే రాష్ట్రంలోని చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయా ‌నియోజ‌క‌వ‌ర్గాల పేర్ల క‌న్నా.. నేత‌ల పేర్లు బ‌లంగా వినిపిస్తుంటాయి. విజ‌య‌వాడ పార్ల‌మెంటు పేరు చెప్ప‌గానే.. ప‌ర్వ‌త‌నేని ఉపేంద్ర గుర్తుకు వ‌స్తారు.

ఇంత‌కు ముందు ఎంతో మంది ఇక్క‌డ నుంచి గెలిచినా.. ఆయ‌న పేరు శాశ్వ‌తంగా నిలిచిపోయేలా ఆయ ‌న అనేక ప్రాజెక్టులు.. చేప‌ట్టారు. అలానే టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా తాను మూడున్న‌ర ద‌శాబ్దాలుగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సొంత నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో త‌న‌కంటూ.. నిలిచిపోయే ప్రాజెక్టుల‌ను కొన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. ఇప్పుడు అవన్నీ... కాల గ‌ర్భంలో క‌లిసిపోయేలా.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌క్కా స్కెచ్‌తో ముందుకు సాగుతోంది. ఒక‌ప్పుడు కుప్పం.. ఇప్పుడు కుప్పం రూపురేఖ‌ల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కుప్పంను జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. మినీ మునిసిపాలిటీ చేశారు..

స‌రే.. ఏదో అభివృద్ధి చేస్తున్నారులే అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఈ అభివృ్ద్ధి పేరుతో చంద్ర‌బాబు ఉనికి లేకుండా చేస్తున్నారు. ఇదే ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది. 1981లో చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో (ఎమ్మెల్యేగా ఉన్న‌స‌మ‌యంలో) కుప్పం గ్రామీణ విద్యుత్‌ సహకార సొసైటీని ఏర్పాటు చేశారు. నియోజ‌క ‌వ‌ర్గంలోన‌ని అన్ని గ్రామాల‌కు విద్యుత్‌ను అందించాల‌నే ల‌క్ష్యంతో దీనిని ఏర్పాటు చేయ‌డం గ‌మనార్హం. దీని పరిధిలో లక్షా ఇరవై నాలుగు వేల కనెక్షన్లుంటే, లక్షా ఇరవై రెండు వేల మంది వాటాదారులు ఉన్నారు.. అందుకే  ఇది... చంద్ర‌బాబు చేసిన అతి పెద్ద ప్రాజెక్టుగా ఇక్క‌డి ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ చెప్పుకొంటారు. బ‌హుశ ఆయ‌న పేరు దీనివ‌ల్ల కూడా ఇక్క‌డ నిలిచిపోయింది.

అయితే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును ఇక్క‌డ ఓడించాల‌నే ల‌క్ష్యంతో అనేక ప్లాన్ల‌కు తెర‌దీ సిన వైసీపీ పాల‌కులు..ఇప్పుడు ఈ సొసైటీని దక్షిణ ప్రాంత డిస్కంలో విలీనం చేయాలని నిర్ణ‌యించింది. అంతేకాదు,, దీనికి సంబంధించి విద్యుత్‌ నియంత్రణ మండలి ఆదేశాలు కూడా ఇచ్చేసింది. దీంతో రేపో మాపో.. చంద్ర‌బాబు చేసిన ఈ ప్రాజెక్టు పులుసులో క‌లిసిపోనుంది. అయితే.. తాజాగా బాబు మాత్రం దీనిని వ్య‌తిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని విరమించాలని కోరుతూ  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు లేఖ రాశారు. ఇది ఏకపక్ష చర్య అని, సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్నారు క‌నుక‌.. అడుగులు ముందుకే ప‌డ‌నున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: