పాపం టీఆర్ఎస్ చాలానే కష్టపడుతోంది. నరేంద్రమోడి మూడు రోజుల క్రితం పార్లమెంటులో మాట్లాడిన మాటలను పట్టుకుని నానా రబస చేస్తోంది. తాజాగా లోక్ సభ+రాజ్యసభలో నరేంద్రమోడిపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చింది. ప్రధానమంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తే ఏమవుతుందనేది వేరే సంగతి. కాకపోతే తాము నోటీసిచ్చినట్లు చెప్పుకోకవటానికి మాత్రమే పనికొస్తుంది.




ఇక విషయానికి వస్తే 2014లో జరిగిన రాష్ట్ర విభజన గురించి మోడి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అడ్డుగోలు విభజన, దానివల్ల ఏపీకి జరిగిన నష్టం తదితర విషయాలను ప్రస్తావించారు. విభజన అంశాన్ని చాలాసేపు మాట్లాడిన మోడి ఎక్కడ కూడా టీఆర్ఎస్ ప్రస్తావన తేలేదు. పైగా తాము విభజనకు వ్యతిరేకంగ కాదని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అయితే మోడి మాట్లాడిన దాన్ని పట్టుకుని మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నానా రచ్చ చేస్తున్నారు.




మోడీని పట్టుకుని తెలంగాణా వ్యతిరేకని, తెలంగాణా ప్రజలను అవమానించారని, ప్రజల మనోభావాలను దెబ్బతీశారంటు ఏమిటేమిటో మాట్లాడేస్తున్నారు. తెలంగాణాకు మోడి క్షమాపణలు చెప్పాలని కూడా మంత్రులు డిమాండ్ చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. తన ప్రసంగం మొత్తం మీద మోడి టార్గెట్ చేసింది కాంగ్రెస్ ను మాత్రమే. మోడీ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తే మధ్యలో టీఆర్ఎస్ ఎందుకు ఉలిక్కిపడిందో అర్ధం కావటంలేదు.




విభజన జరిగిన తీరుపై మోడీ చెప్పిందాంట్లో చాలా వరకు నిజాలే ఉన్నాయి. విభజన ఎలా జరిగిందనే విషయాన్ని ఇపుడు మోడీ కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. మరందరికీ తెలిసిన విషయంలో టీఆర్ఎస్ ఇంత రబస ఎందుకు చేస్తోందో అర్ధం కావటంలేదు.  విభజన తీరుకు వ్యతిరేకంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టులో వేసిన కేసు అలాగే ఉండిపోయింది. మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ చేస్తున్న గోల చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మరి టీఆర్ఎస్ కష్టం వర్కవటవుతుందా ?

మరింత సమాచారం తెలుసుకోండి: