తమ దేశ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునేందుకు చూస్తున్న రష్యాకు ఉక్రెయిన్ ధీటుగా బదులిస్తోంది. ఆ దేశ బలగాలపై ఉక్రెయిన్ సైన్యం ఎదురుదాడికి దిగింది. రష్యన్ ఆర్మీకి చెందిన ఐఎల్-76 ఎయిర్ క్రాఫ్ట్ ను కూల్చేసింది. అలాగే 150మంది రష్యా సైనికులను హతమార్చినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది.
మరోవైపు ఉక్రెయిన్ సైనికుడు ఒకరు తనను తాను పేల్చేసుకున్న ఘటన కంటతడి పెట్టిస్తోంది. క్రిమియా నుంచి చొచ్చుకు వస్తున్న రష్యా దళాలను నిలువరించడం కోసం బ్రిడ్జిని పేల్చేయాలని మెరైన్ బెటాలియన్ ఇంజినీర్ వొలొదిమిరోవిచ్ సంకల్పించాడు. అందుకు బ్రిడ్జికి బాంబులు అమర్చాలనుకున్నాడు. ఈ లోపే రష్యా బలగాలు దూసుకురావడంతో ఆ బాంబులను తనకే అమర్చుకొని బ్రిడ్జిని పేల్చేశాడు.
ఇక ఉక్రెయిన్ లో రష్యా సైనికులు దురాగతాలకు పాల్పడుతున్నారు. సామాన్య జనంపై కర్కశంగా వ్యవహరిస్తున్నారు. కీవ్ పార్లమెంట్ భవనానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో వెళ్తున్న కారుపై రష్యా సైనికులు యుద్ధ ట్యాంకును ఎక్కించారు. అక్కడితో ఆగకుండా మరోసారి వెనక్కి వెళ్లి మరీ ఆ కారును తొక్కించారు. నుజ్జునుజ్జయిన కారులో చిక్కుకున్న డ్రైవర్ ను స్థానికులు బయటకు తీశారు. అతను స్వల్ప గాయాలతో ప్రాణాలను దక్కించుకున్నాడు.