రాబోయే ఎన్నికలకు సంబంధించి విజయనగరం రాజావారు అశోక్ గజపతిరాజుకు చంద్రబాబునాయుడు పెద్ద షాకే ఇచ్చినట్లున్నారు. రాజకీయంగా క్లైమ్యాక్సుకు చేరుకున్న అశోక్ కి చంద్రబాబు ఇచ్చిన షాక్ మామూలుగా లేదు. 73 ఏళ్ళ అశోక్ కు రాబోయేవి చివరి ఎన్నికలని అనుకోవాలి. అందుకనే చివరి ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా తాను పోటీచేసి కూతురు అదితిరాజును విజయనగరం ఎంఎల్ఏగా గెలిపించుకునేందుకు బాగా కష్టపడుతున్నారు. పోయిన ఎన్నికల్లో అశోక్ ఎంపీగా పోటీచేసి ఓడిపోతే కూతురు ఎంఎల్ఏగా ఓడిపోయిన విషయం తెలిసిందే.





తామిద్దరికీ టికెట్లు కావాలని ఆమధ్య అశోక్ అడిగితే చంద్రబాబు కుదరదన్నారట. ఫ్యామిలీ ప్యాక్ లో ఇద్దరికీ టికెట్లు ఇవ్వటం కుదరదని చెప్పేశారని  పార్టీలోనే టాక్ నడిచింది. అయితే అశోక్ మాత్రం తాను ఎంపీగా, కూతురు ఎంఎల్ఏగా  పోటీచేస్తామని జిల్లా పర్యటనల్లో చెప్పుకుంటున్నారు. అలాంటిది చంద్రబాబుతో అశోక్ తాజా భేటీలో రాజుగారిని విజయనగరం ఎంఎల్ఏగా పోటీచేయాలని కన్ఫర్ముడుగా చెప్పేశారట. కూతురికి టికెట్ ఇవ్వటం సాధ్యంకాదని కూడా తేల్చి చెప్పేశారట.





దాంతో ఇపుడు అశోక్ కు ఏమిచేయాలో అర్ధంకావటంలేదు. ఇక్కడ రాజుగారి సమస్య ఏమిటంటే కూతురి రాజకీయ భవిష్యత్తును సెటిల్ చేయటమే. ఆరుసార్లు ఎంఎల్ఏగా ఒకసారి ఎంపీగా గెలచిన అశోక్ తన విషయం కన్నా కూతురు అదితి భవిష్యత్తుపైనే ఎక్కువ బెంగ పెట్టుకున్నారట. 2019లో తాను ఎంపీగా, కూతురు ఎంఎల్ఏగా గెలుపు ఖాయమనే అనుకున్నారట. అయితే ఇద్దరు ఓడిపోయారు.





అందుకనే రాబోయే ఎన్నికల్లో అయినా తాను ఎంపీగా గెలిచి, కూతురును ఎంఎల్ఏగా గెలిపించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే చంద్రబాబేమో  అసలు కూతురికి టికెట్టే ఇవ్వటంలేదని తేల్చిచెప్పేయటం రాజుగారికి మింగుడుపడటంలేదని సమాచారం. పోనీ ఎంపీగా ఎవరిని పోటీచేయించినా ఎంఎల్ఏగా తన కూతురికి టికెట్ ఇవ్వమని అడిగినా చంద్రబాబు అంగీకరించలేదట. రాబోయే ఎన్నికలు చాలా కీలకమైనవి కాబట్టి సీనియర్ అయిన అశోక్ నే పోటీచేయమని చెప్పేశారట. దాంతో షాక్ తగిలినట్లు అశోక్ ఫీలవుతున్నారని తమ్ముళ్ళ సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: