ఫోన్ రావటం ఓ 15 నిముషాలు ఆలస్యమయ్యుంటే ఎంత బాగుండేదని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇపుడు అనుకుంటున్నారు. ఇంతకీ ఫోనేంటి ? 15 నిముషాలు ఆలస్యమేంటి ? 2019 ఎన్నికల సందర్భంగా తాను ప్రచారం కోసం జమ్మలమడుగు వెళుతున్నారట. అలా వెళుతున్నపుడు పులివెందులలోనే వివేకానందరెడ్డి ఇంటినుండి ఫోన్ వచ్చిందట. వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి మాట్లాడారట. నర్రెడ్డి మాట్లాడుతు వివేకా గుండెపోటుతో మరణించినట్లు చెప్పారట. దాంతో తాను వెనక్కుతిరిగి పులివెందుల చేరుకున్నట్లు అవినాష్ చెప్పారు.




నర్రెడ్డి నుండి ఫోన్ రావటం మరో 15 నిముషాలు ఆలస్యం అయ్యుంటే తాను అప్పటికప్పుడే వివేకా ఇంటికి వచ్చుండే అవకాశం లేదన్నారు. ఎందుకని చెప్పలేదుకానీ బహుశా మొబైల్ సిగ్నల్ అందుండేది కాదన్నది అవినాష్ ఉద్దేశ్యం అయ్యుండచ్చు. జమ్మలమడుగుకి చేరుకున్న తర్వాత ఫోన్ వచ్చున్నా వెంటనే తిరిగొచ్చేవాడినే అనిచెప్పారు. అయితే అప్పటికే వివేకా ఇంట్లో చాలామంది ఉండేవారు కాబట్టి హత్య సాక్ష్యాధారాలను చెరిపేందుకు కుట్రచేశాననే నింద తనపైన పడుండేది కాదన్నారు.





తాను వివేకా ఇంటికి వెళ్ళేటప్పటికే కొందరు అక్కడున్నట్లు అవినాష్ చెప్పారు. హత్యకు కుట్రలో కానీ సాక్ష్యాల చెరపటంలో కానీ తన పాత్రేమీ లేదని అవినాష్ స్పష్టంగా చెప్పారు.  తనను, పార్టీని డ్యామేజి చేసేందుకే సునీతతో కొందరు పెద్దలు కుట్రలు చేసినట్లు అవినాష్ ఆరోపించారు. తన విజయంకోసం ప్రచారంచేస్తున్న వివేకాను హత్య చేయాల్సిన అవసరం తనకు ఏముందని అవినాష్ ప్రశ్నించారు.





సీబీఐ దర్యాప్తులో మొదటిసారి స్టేట్మెంట్ ఇచ్చిన సునీత జరిగిన హత్యలో తన పాత్రగురించి ఏమీ చెప్పలేదని గుర్తుచేశారు. రెండోసారి స్టేట్మెంట్ ఇచ్చినపుడే తనపై ఆరోపణలు చేసినట్లు చెప్పారు. అంటే సునీత ఇచ్చిన రెండు స్టేట్మెంట్ల మధ్య ఏదో జరిగింది కాబట్టి సునీత తన స్టేట్మెంట్లను మార్చేసినట్లు అవినాష్ అనుమానించారు. రెండు స్టేట్మెంట్ల మధ్య వ్యత్యాసం ఎందుకు వచ్చింది ? ఏమి జరిగిందనే విషయాన్ని సునీతే చెప్పాలని అవినాష్ అన్నారు. హత్యలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని నిరూపించుకోవటానికి ఎంపీని అయ్యుండి కూడా తానెంత అవస్తలు పడుతున్నానో అందరు చూస్తున్నదే అని అవినాష్ నిర్వేధంతో చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: