ఏ నాయకుడి పాలన బాగా ఉంది.. ఎక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తారు.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఏంటి.. ఇలాంటి అంశాలను తెలుసుకునేందుకు నాయకులు తరచూ సర్వేలు చేయించకుంటుంటారు. ఇలాంటి శాస్త్రీయ పద్దతులను ఉపయోగించుకోడవంలో టీడీపీ అధినేత చంద్రబాబు ముందు వరుసలో ఉంటారు. ఐతే తాజాగా ఓ సర్వే ఫలితాలు ఆయనకు షాక్ ఇచ్చాయట.
ఇలాంటి సర్వేలు చేయించడంలో కాంగ్రెస్ నాయకుడు లగడపాటి రాజగోపాల్ కు మంచి పేరు ఉంది. ఆయన్ను గతంలో ఆంధ్రా ఆక్టోపస్ అని ముద్దుగా పిలుచుకునేవారు కూడా. ఆయన సర్వే ఫలితాలు దాదాపు నూటికి 90శాతం కరెక్టు కావడం విశేషం. అలాంటి వ్యక్తి తాజాగా చేయించిన సర్వే ఫలితాలు చంద్రబాబుకు షాక్ ఇచ్చాయన్న వార్తలు ఇప్పుడు షికారు చేస్తున్నాయి.
లగడపాటి సర్వే ప్రకారం టీడీపీకి రాబోయే ఎన్నికల్లో దిమ్మతిరిగే ఫలితాలు రాబోతున్నాయట. తాజా పరిస్థితి కొనసాగితే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం అసాధ్యమని ఈ సర్వే తెల్చి చెప్పిందట. ఎందుకంటే.. ఏపీలో మొత్తం 65 శాతం అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం ఉన్నదట. అధికార పార్టీకి చెందిన 129 మంది ఎమ్మెల్యేల్లో 80 మంది ఓడిపోవడం ఖాయమట.
విచిత్రమేమిటంటే.. ఈ సర్వేకు సంబంధించిన ఫలితాలకు సంబంధించిన వార్తలు టీడీపీ అనుకూల మీడియాతోనే వెలుగు చూశాయి. సర్వే చేయించిన రాజగోపాల్.. ఆ సర్వే ఫలితాలను లగడపాటి విశ్లేషించారట. రైతుకు రుణమాఫీ పూర్తిగా జరగకపోవడం, డ్వాక్రా మహిళలకు పైసా కూడా అందకపోవడం వంటి అంశాలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెంచాయని లగడపాటి వివరించారు. మరి చంద్రబాబు ఎలా జాగ్రత్తపడతారో ఏమో..!