ఏపీలో విపక్ష టీడీపీకి వరుస పెట్టి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. గత నెల రోజుల్లోనే ఆ పార్టీకి ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. నెల రోజుల్లోనే ఎంతో మంది కీలక నేతలు పార్టీ వీడి బయటకు వెళ్లారు. ఓ వైపు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు తన తనయుడు సుధీర్ బాబుతో కలిసి వైసీపీలోకి వెళ్లారో లేదో ఆ వెంటనే మరో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఈ ఎస్ ఐ అవినీతి కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఆ వెంటనే మరో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని సైతం పోలీసులు ఆయన తనయుడు అస్మిత్ రెడ్డితో కలిసి అరెస్టు చేశారు. దీంతో టీడీపీలో ఏం జరుగుతోందో ? కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
ఇక ఇప్పుడు ఆ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న కృష్ణా జిల్లాలో దిమ్మ తిరిగి పోయే షాక్ తగలనుంది. జిల్లాలో టీడీపీ కంచు కోటలుగా ఉన్న రెండు నియోజక వర్గాల్లో పలువురు కీలక నేతలు వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా టీడీపీకి జిల్లాలో మిగిలిన ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ ప్రాథినిత్యం వహిస్తోన్న విజయవాడ తూర్పు నియోజకవర్గంతో పాటు పెనమలూరు నియోజకవర్గాల నుంచి భారీ స్థాయిలో టీడీపీలో కీలక నేతలుగా ఉన్న వారు, గ్రామ స్థాయి నేతలుగా ఉన్న వారు సైకిల్ దిగేసి ఫ్యాన్ గూటి కిందకు చేరిపోతున్నారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఆరు డివిజన్లలో కీలక నాయకులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. వీరంతా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు కొద్ది సంవత్సరాలుగా ప్రధాన అనుచరులుగా ఉంటున్నారు. వీరంతా ఎమ్మెల్యే తీరు నచ్చకే పార్టీ వీడుతున్నారు. ఇక పెనమలూరు నియోజకవర్గంలో కమ్మ వర్గం నేతలే ఎక్కువుగా వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. నియోజకవర్గ కేంద్రమైన పెనమలూరు, కానూరు, గంగూరు, ఈడుపుగల్లు, కంకిపాడు, ఉప్పులూరు గ్రామాల నుంచి గ్రామ స్థాయి నేతలతో సహా ద్వితీయ శ్రేణి కేడర్ భారీ ఎత్తున పార్టీ మారుతోంది. ఈ నియోజకవర్గంలోనే ఏకంగా వెయ్యి మంది నేతలు పార్టీమారిపోతున్నారట. ఏదేమైనా టీడీపీకి ఇది పెద్ద ఎదురు దెబ్బే..?