తెలంగాణ రాష్ట్రంలో ఆరుచోట్ల ఎయిర్పోర్టుల నిర్మాణానికి వేగంగా అడుగులుపడుతున్నాయి. తాజాగా ఏఏఐ రాష్ట్రంలో ఆరుచోట్ల సర్వే నిర్వహించి అనుకూలత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతో తెలంగాణ ప్రజల్లో సంతోషం నెలకొంటోంది. గత సంవత్సరం రాష్ట్రంలో ఆరు చోట్ల ఎయిర్పోర్టులు నిర్మించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే బాధ్యతను ఏఏఐకు అప్పగించింది. దీంతో ఏఏఐ బృందం కొత్తగూడెం, వరంగల్, మహబూబ్నగర్ ఏరియాల్లో పర్యటించి అధ్యయనం చేసింది. సంబంధిత నివేదికను ఆ బృందం ఉన్నతాధికారులకు అందజేసింది. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని తాజాగా ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఈ ప్రాంత వాసుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
నాలుగేళ్ల క్రితం లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడచెలక వద్ద సుమారు 1600 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఢిల్లీలోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం అధ్యయనం చేసి వెళ్లింది. ఇక్కడ ఎయిర్పోర్టు నిర్మించేందుకు చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి వద్ద విమానశ్రయం ఏ ర్పాటుకు మార్గం సుగమమైందనే చెప్పాలి. ప్రతిపాదిత స్థలం అను కూలంగా ఉందని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధ్యయనంలో తేలింది. అధ్యయనం నివేదికను త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.
అలాగే పెద్దపల్లి జిల్లా బసంత్నగర్లో ఎయిర్పోర్టు ఏర్పాటుతో పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్భూపాలపల్లి జిల్లాలోని పరిశ్రమ ల నిర్వహకులు, వ్యాపారులు, ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టు, సింగరేణి బొగ్గు గను లు, బిర్లా కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ, ఆర్ఎఫ్సీఎల్ పరిశ్రమలతోపాటుగా జేఎన్టీయూ కృషి విజ్ఞా న కేంద్రం ఉండడంతో వీటికి వచ్చే దేశ విదేశీ నిపుణులు, ఇంజినీర్లు, డాక్టర్లు, అన్ని రం గాల నిపుణులకు సౌకర్యవంతంగా మారనున్నది. ఇక వరంగల్ జిల్లాలో ఎప్పటి నుంచో ప్రతిపాదనలతో ఉన్న మామునూరులో విమానాశ్రయం పునర్నిర్మాణం దాదాపు ఖరారైందనే చెప్పాలి.