ఈటల రాజేందర్పై వచ్చిన భూకబ్జా ఆరోపణలను పలు కోణాల్లో విచారణకు ఆదేశించిన కేసీఆర్.. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఈటలను కటకటాల్లోకి నెట్టేందుకు మార్గం సుగుమం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసైన్డ్ భూములు కబ్జాలు నిజమేనని కమిటీ తేల్చింది. అయితే హైకోర్టులో ఈటల రాజేందర్కు కొంత ఊరట లభించింది. కేసీఆర్ మాత్రం తనదైన వ్యూహాలతో ముందుకెళ్తూ ఈటలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తాజాగా ఈటల రాజేందర్ కుమారుడు నితిన్ రెడ్డిపై భూకబ్జా ఆరోపణలు రావడంతో తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని సీఎస్ సోమేష్ కుమార్ను కేసీఆర్ ఆదేశించారు.
మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామనివాసి పీట్ల మహేష్ ముదిరాజ్ అనే వ్యక్తి ఈటల రాజేందర్ కుమారుడు నితిన్రెడ్డి తన భూమిని కబ్జాచేశాడంటూ సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేశాడు. తన భూమిని ఇనాం భూమిగా చూపుతూ కొనుగోలు చేసి ఇప్పుడు తమను ఆ భూమిలోకి రాకుండా బెదిరిస్తున్నారని మహేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఫిర్యాదుపై స్పందించిన కేసీఆర్.. వెంటనే దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ, అవినీతి నిరోదకశాఖ, విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కేసీఆర్ వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఈటలకు ప్రస్తుత వ్యవహారం మరింత తలనొప్పిని తెచ్చిపెడుతుందనటంలో అతిశయోక్తిలేదు.