కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపి విలీనం చేయటానికి ముహూర్తం నిర్ణయమైందని పార్టీ అధినేత్రి షర్మిల ప్రకటించారు. జనవరి 4వ తేదీన తన పార్టీని కాంగ్రెస్ లో వినీలం చేయబోతున్నట్లు షర్మిల చెప్పారు. ఆరోజు ఉదయం 11 గంటలకు షర్మిలను ఢిల్లీలోని కాంగ్రెస్ ఆపీసుకు రావాలని ఐఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుండి సమాచారం అందింది. అందుకనే 3వతేదీన సుమారు 40 మంది మద్దతుదారులతో షర్మిల ఢిల్లీకి వెళుతున్నారు.
తనకు ఏఐసీసీలో కీలకపదవిని కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసినట్లు ఇడుపులపాయలో మంగళవారం జరిగిన ముఖ్యనేతల సమావేశంలో చెప్పారు. అయితే ఆ కీలకపదవి ఏమిటో మాత్రం షర్మిల చెప్పలేదు. పార్టీవర్గాల సమాచారం ప్రకారం ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించి కర్నాటక లేదా తెలంగాణా నుండి రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
కాబట్టి ఏపీ సారధ్య బాధ్యతలను షర్మిలకు అప్పగించబోతున్నారనే ప్రచారంలో వాస్తవంలేదని అర్ధమవుతోంది. ఏఐసీసీలో కీలకపదవి అని స్వయంగా షర్మిలే చెప్పారు కాబట్టి ఇక ఏపి అధ్యక్ష బాధ్యతలని అనుకునేందుకు లేదు. కాకపోతే హోదా ఏమిటన్నది పక్కనపెట్టేస్తే ఆమె పార్టీలో చేరటమే ముఖ్యమన్నట్లుగా తయారైంది వ్యవహారం. పార్టీ విలీనం ప్రక్రియ సందర్భంగా సోనియాగాంధి, రాహుల్ గాంధి, ప్రియాంకగాధి కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మొదటినుండి పర్యవేక్షిస్తున్న కర్నాటక పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎలాగూ ఉంటారు.
పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ బలోపేతానికి షర్మిల ఎంతవరకు కష్టపడతారన్నది ఆసక్తిగా మారింది. షర్మిల వల్ల పార్టీకి ఎంతమేరకు ఉపయోగకరమో చూడాలి. ఎందుకంటే మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతుండగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన ఏ విధంగా బలపడుతుంది ? పదేళ్ళుగా భూస్ధాపితం అయిపోయిన కాంగ్రెస్ కు జవజీవాలు ఇవ్వాలంటే షర్మిల వల్ల అయ్యేపనికాదు. గడచిన రెండు ఎన్నికలతో పోల్చితే రాబోయే ఎన్నికల్లో పదిఓట్లు అదనంగా వస్తే రావచ్చేమో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి