చాలాకాలంగా తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కూతురు సునీత తన సోదర సమానుడు జగన్మోహన్ రెడ్డి మీద పరోక్షంగా ఆరోపణలు చేస్తున్నారు. అలాంటిది ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో ఒక్కసారిగా ముసుగు తొలగించేసి ఓపెన్ అయిపోయారు. తన తండ్రి హత్యకేసులో న్యాయం జరగాలంటే జగన్ కు, వైసీపీకి ఓట్లేయద్దని జనాలకు విజ్ఞప్తిచేశారు. హత్యారాజకీయాలకు పాల్పడే వాళ్ళకి పరిపాలించే హక్కులేదని ఆమె అబిప్రాయపడ్డారు.





తనకు న్యాయం జరగాలంటే రాష్ట్ర జనాభా, మీడియా అండగా నిలబడాలన్నారు. నాలుగైదు రోజుల్లో తేలిపోవాల్సిన హత్యకేసు ఇన్ని సంవత్సరాలైనా ఎందుకు ఫైనల్ కాలేదని ఆమె ప్రశ్నించారు.  డైరెక్టుగా చెప్పలేదు కాని హత్యకేసులో కీలక పాత్రదారులను జగనే రక్షిస్తున్నాడన్నట్లుగా చెప్పారు. జగన్ కు ఓట్లేయద్దని, వైసీపీని ఓడించమని బహిరంగంగా పిలుపిచ్చిన సునీత  హంతకులను జగనే రక్షిస్తున్నారని మాత్రం చెప్పేధైర్యం చేయలేదు. ఎంఎల్సీ ఎన్నికల్లో తన తండ్రిని సొంతవాళ్ళే ఓడించారని ఆమె ఆరోపించారు. వివేకాను ఓటమికి తానే కారణమని టీడీపీ నేత బీటెక్ రవి కొన్ని వందలసార్లు చెప్పుంటారు. దాన్ని మాత్రం ఆమె పరిగణలోకి తీసుకోవటంలేదు.





తన తండ్రి హత్యకేసులో తనతో పాటు తన బర్త రాజశేఖరరెడ్డిపైన సీబీఐ తప్పుడు కేసులు పెట్టినట్లు మండిపోయారు. తమనే సీబీఐతో కేసులు పెట్టించి ఇరికిస్తున్నట్లు ఆరోపించారు. వివేకా రెండోభార్య షమీమ్ ఆరోపణల ప్రకారం సునీత, ఆమె భర్తే వివేకాహత్యకు కారణం. కోర్టులో ఆమె వేసిన పిటీషన్ ఆధారంగానే సీబీఐ కేసు పెట్టడాన్ని ఆమె తట్టుకోలేకపోతున్నారు. ఆమె ఎంతసేపు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డే కీలక పాత్రదారులుగా ఆరోపిస్తున్నారు. అయితే తన ఆరోపణలకు తగ్గ ఆధారాలను మాత్రం చూపలేకపోతున్నారు.





తాను ఆరోపణలు చేశాను కాబట్టి వాళ్ళిద్దరినీ సీబీఐ అరెస్టు చేయాల్సిందే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. విచిత్రం ఏమిటంటే వివేకానందరెడ్డిని తాను ఎలా గొడ్డలితో నరికిచంపాననే విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పిన దస్తగిరి బెయిల్ రద్దుచేసి జైలుకు పంపాలని మాత్రం సునీత కేసు వేయలేదు. పైగా దస్తగిరి బెయిల్ రద్దుచేయాలని వివేకాకు పీఏగా పనిచేసిన క్రిష్టారెడ్డి వేసిన పిటీషన్ను సునీత తీవ్రంగా వ్యతిరేకించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: