- విశాఖ నార్త్, ఉండిలో రెండు వైపులా రాజుల హోరాహోరీ
- పశ్చిమగోదావరిలో ఆచంట, ఉండి, నరసాపురం సీట్లు వీళ్లవే
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
రాజులు రాజవంశీయులు అంటే ఒకప్పుడు ఎంతో ఉన్నతమైన స్థానం.. రాజ్యాలను మహారాజులే ఏలేవారు. వారి కింద ఉండే సామంతులు కూడా చిన్న చిన్న రాజులే. ఇప్పుడు రాజ్యాలు పోయాయి... అయితే రాజులు మాత్రం రాజ్యాధికారం విషయంలో చట్టసభలకు పోటీ చేసే విషయంలో తమ పట్టు ఎప్పటకీ నిలుపుకుంటూ వస్తున్నారు. ఏపీ జనాభాలో ఒక్క శాతం కూడా లేని రాజులు ఏకంగా 10 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
విశాఖ నార్త్, పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండిలో అయితే రెండు ప్రధాన పక్షాల నుంచి రాజులే పోటీలో ఉన్నారు. ఉండిలో అయితే ఏకంగా ముగ్గురు రాజుల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. ఇక జనసేన నుంచి ఉంగుటూరులో ధర్మరాజు పోటీలో ఉన్నారు. జనసేన ఈ సామాజిక వర్గానికి కేటాయించిన ఏకైక సీటు ఇది. ఇక వైసీపీ నుంచే ఎక్కువ మంది రాజులు పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి ఐదుగురు రాజులు పోటీ చేస్తుంటే.. టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలుగా పోటీలో ఉన్నారు. జనసేన ఒక సీటు ఇవ్వగా.. రాజుల కంచుకోటగా చెప్పుకునే నరసాపురం ఎంపీ సీటును కూడా బీజేపీ రాజుకే కేటాయించింది. భూపతిరాజు శ్రీనివాసవర్మ పోటీలో ఉన్నారు. వివిధ నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచి పోటీలో ఉన్న క్షత్రియ సామాజిక వర్గ నేతల వివరాలు ఇలా ఉన్నాయి.
పార్లమెంటు:
1) నరసాపురం
భూపతిరాజు శ్రీనివాసవర్మ ( బీజేపీ)
అసెంబ్లీ:
1) వైజాగ్ నార్త్ :
కేకే రాజు ( వైసీపీ ) విష్ణుకుమార్ రాజు ( బీజేపీ)
2) యలమంచిలి :
కన్నబాబు రాజు ( వైసీపీ)
3) ఆచంట
చెరుకువాడ రంగనాథరాజు ( వైసీపీ)
4) నరసాపురం
ముదునూరు ప్రసాదరాజు ( వైసీపీ)
5) ఉండి
సీవీఎల్ నరసింహారాజు ( వైసీపీ), రఘురామ కృష్ణంరాజు ( టీడీపీ), వేటూకూరి వెంకటశివరామరాజు ( ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్)
6) విజయనగరం
అతిథి గజపతిరాజు ( టీడీపీ)
7) చోడవరం
నాగసన్యాసిరాజు ( టీడీపీ)
8) ముమ్మడివరం
దాట్ల సుబ్బరాజు ( టీడీపీ)
9) ఉంగుటూరు
పత్సమట్ల ధర్మరాజు ( జనసేన)
10) బాపట్ల
వేగేశన నరేంద్రవర్మ ( టీడీపీ)
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి