అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచీ బిహార్‌ రాష్ట్రం మొత్తం ఎన్నికల హీటుతో కిక్కిరిసిపోయింది. అభ్యర్థులు, పార్టీలు తమ మేనిఫెస్టోలు విడుదల చేస్తూ హామీల వర్షం కురిపిస్తుంటే — మరో వైపు గల్లీల్లో, వీధుల్లో తాయిలాల జాతర సాగుతోంది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షం వరకు, ప్రతి అభ్యర్థి ఓటర్ల మనసు గెలుచుకోవడానికి నానా తంతులు వేస్తున్నారు. ఈసారి అధికార యంత్రాంగం పహారా కట్టినా.. చాటుగా డబ్బులు, బంగారం, మద్యం, గిఫ్టులు పంపిణీ అవుతూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, స్పెషల్‌ పికెట్‌లు, సర్వైలెన్స్‌ టీంలు ప్రతి ప్రాంతంలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయినప్పటికీ అక్రమ రవాణా, డబ్బు పంపిణీ, తాయిలాల దందా తగ్గేలా కనిపించడం లేదు. ఈసీ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం — ఇప్పటివరకు బిహార్‌తో పాటు ఉపఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాల నియోజకవర్గాల్లో 108 కోట్ల రూపాయల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.


వివరాల్లోకి వెళ్తే — 9.62 కోట్ల రూపాయల నగదు, 42.14 కోట్ల రూపాయల విలువైన మద్యం, 5.8 కోట్ల రూపాయల బంగారం, వెండి ఆభరణాలు, అలాగే 26 కోట్ల రూపాయల విలువైన వివిధ వస్తువులు అధికారులు పట్టుబడ్డాయి. అంతేకాదు, మద్యం నిషేధం దశాబ్దంగా అమల్లో ఉన్నా — బిహార్ సరిహద్దుల్లో లిక్కర్ రవాణా మాత్రం ఆగట్లేదు. పొరుగురాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో అక్రమ మద్యం తరలించబడుతుండటంతో పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులకి చిత్తశుద్ధి పరీక్షగా మారింది ఈ ఎన్నికలు.



ఇక షాకింగ్ అంశం ఏమిటంటే — ఇప్పటివరకు 24.61 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ కూడా సీజ్ చేశారు. ఓటర్లను ప్రభావితం చేయడంలో మత్తు పదార్థాల వినియోగం పెరుగుతుందనే సంకేతాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఓటర్లు స్వయంగా అవగాహన కలిగి ఉండాలని ఈసీ పిలుపునిస్తోంది. ఎవరైనా డబ్బు, బహుమతులు, మద్యం లేదా ఇతర తాయిలాలు పంచుతున్నట్లు గమనిస్తే, నేరుగా ‘ఛ్-విగిల్’ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఆ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులను 100 నిమిషాల లోపు పరిష్కరించేందుకు ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.



బిహార్ అంతటా 824 ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, 816 సర్వైలెన్స్‌ టీంలు సక్రియంగా పనిచేస్తున్నాయి. వీటితో పాటు ఎక్సైజ్‌, ఐటీ, కస్టమ్స్‌, రెవెన్యూ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  విభాగాలకు కూడా కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఏ రూపంలోనైనా అవినీతి లేదా అక్రమ రవాణా జరగకుండా కట్టడి చేయాలని ఈసీ స్పష్టం చేసింది. మరోవైపు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ‘జీరో టాలరెన్స్‌’ విధానంతో వ్యవహరిస్తామని ఈసీ స్పష్టం చేసింది. బిహార్ పోలింగ్‌ను ఒక పెద్ద ఛాలెంజ్‌గా తీసుకున్నామని తెలిపింది.ఈసారి బిహార్‌ ఎన్నికలు ఇండీ అలయన్స్‌ మరియు ఎన్‌డీఏ కూటమి మధ్య ప్రతిష్టాత్మక పోరుగా మారాయి. రెండు వర్గాలు కూడా ఈ ఎన్నికల ఫలితాలను తమ భవిష్యత్తు రాజకీయ దిశను నిర్ణయించే సూచికగా చూస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేడెక్కిన ప్రచారం, ప్రజా ర్యాలీలు, వాగ్దానాలు, విమర్శలు — అన్నీ కలగలిసి ఎన్నికల వాతావరణాన్ని ఉత్కంఠభరితంగా మార్చేశాయి. ఈ నెల 6వ తేదీ, 11వ తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. అనంతరం 14న ఫలితాలు వెలువడతాయి. ఈ ఫలితాలు బిహార్ రాజకీయ పటంలో కొత్త మలుపు తిప్పుతాయా.. లేక పాత శక్తులు మళ్లీ గెలుస్తాయా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: