క్రిప్టోకరెన్సీ మాఫియాలు ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచాన్నే తమ వ్యాపార వేదికగా మార్చుకున్నాయి. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న ఎక్స్ (పూర్వం ట్విట్టర్) ఖాతాలను టార్గెట్ చేసుకుని, వాటిని హ్యాక్ చేసి తమ ప్రచారానికి వాడుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో జనసేన పార్టీ అధికారిక ఎక్స్ హ్యాండిల్ కూడా చేరింది. ఈ సంఘటనతో పార్టీ టెక్ టీం పెద్ద షాక్‌కి గురైంది. జనసేన పార్టీ ఎక్స్ ఖాతాకు రెండున్నర మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. భారతదేశం మాత్రమే కాదు, విదేశాల్లో కూడా జనసేన అభిమానులు విస్తరించి ఉన్నారు. అటువంటి పెద్ద ఫాలోయింగ్ కలిగిన ఖాతాను హ్యాక్ చేయడం ద్వారా క్రిప్టో మాఫియాలు తమ స్కామ్‌కు పెద్ద దారిని తెరిచారు.
 

హ్యాకర్లు వెంటనే పాస్‌వర్డ్ మార్చేసి, జనసేన టీం యాక్సెస్‌ను పూర్తిగా బ్లాక్ చేశారు. ఇప్పుడు ఆ ఖాతా నుండి క్రిప్టోకరెన్సీ సంబంధిత పోస్టులు వరుసగా వస్తున్నాయి. ఇదే తరహా హ్యాకింగ్ ఘటనలు గతంలో కూడా జరిగాయి. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్‌సీపీ ట్విట్టర్ ఖాతాలు కూడా క్రిప్టో మాఫియాల చేతిలో చిక్కాయి. వారూ కొన్ని రోజులు తమ అకౌంట్‌లను తిరిగి పొందలేకపోయారు. ఆ సమయంలో కూడా హ్యాకర్లు “క్రిప్టోలో పెట్టుబడి పెట్టండి”, “ఇది కొత్త గ్లోబల్ ఫ్యూచర్” వంటి పోస్టులతో సోషల్ మీడియాను ఆక్రమించారు. ఆ స్కామ్ పూర్తయ్యాక ఖాతాను వదిలేసారు. ఇప్పుడు జనసేన ఖాతా కూడా అదే మోడల్‌లో దాడికి గురైంది. క్రిప్టో మాఫియాలు టెక్నికల్‌గా అత్యంత శక్తివంతంగా ఉంటాయి.

 

వీరి వద్ద సైబర్ సెక్యూరిటీ నిపుణులు, హ్యాకింగ్ స్పెషలిస్టులు, సోషల్ మీడియా మానిప్యులేటర్లు ఉంటారు. వీరు ఒకే వ్యక్తి కాదు, ఒక పెద్ద నెట్‌వర్క్‌గా పనిచేస్తారు. అందుకే వీరిని ట్రాక్ చేయడం, వారినుంచి తప్పించుకోవడం దాదాపుగా అసాధ్యం. జనసేన పార్టీ ప్రస్తుతం ఎక్స్ అధికారులను సంప్రదించి, తమ అధికారిక హ్యాండిల్‌ను తిరిగి పొందేందుకు కృషి చేస్తోంది. ఈ ఘటన పార్టీ ప్రతిష్టకు తాత్కాలిక దెబ్బతీసినా, టెక్ టీం పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సంఘటనతో ఇతర రాజకీయ పార్టీలు కూడా సోషల్ మీడియా భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: