దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఘోర ఘటన చోటు చేసుకుంది. ఎర్రకోట మెట్రో స్టేషన్‌ సమీపంలోని పార్కింగ్‌ ఏరియాలో నిలిపి ఉంచిన కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. ఘోరమైన ఈ పేలుడు కారణంగా ఇప్పటివరకు కనీసం 13 మంది దుర్మరణం పాలయ్యినట్లు సమాచారం. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం వారిని ఎల్‌ఎన్‌జేపీ (LNJP) ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఎప్పటికప్పుడు అధికారులు అక్కడ పరిస్ధితిని వివరిస్తూనే ఉన్నారు.
 

పేలుడు చోటుచేసుకున్న కారు ఐ20 మోడల్‌దిగా గుర్తించారు. ఆ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ HR26 7674గా నమోదు కాగా, హర్యానాకు చెందిన నదీమ్ ఖాన్ అనే వ్యక్తి పేరుపై రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా బలగాలు ప్రధాన ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్‌, విమానాశ్రయం ప్రాంతాల్లో మోహరించారు. సంఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా స్పందించారు. ఆయన వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. తర్వాత ఐబీ చీఫ్‌, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించి, దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు.



అదే సమయంలో ఎన్‌ఐఏ (NIA), ఎన్‌ఎస్‌జీ (NSG) బృందాలను కూడా దర్యాప్తులో భాగం చేశారు. ప్రారంభ సమాచారం ప్రకారం, ఈ పేలుడులో అమ్మోనియం నైట్రేట్ వాడి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాద కోణంలోనూ విచారణను కొనసాగిస్తున్నారు.దేశ రాజధానిలో జరిగిన ఈ ఘటనతో దేశవ్యాప్తంగా భద్రతా సన్నాహాలు మరింత కట్టుదిట్టం చేయబడ్డాయి. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రక్షణ కేంద్రాలు, ముఖ్యమైన ప్రజా ప్రదేశాల వద్ద అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. పేలుడు వెనుక ఉన్న అసలు కారణాలు, నిందితుల ఉద్దేశాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: