దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న భయంకరమైన పేలుడు దేశాన్ని కుదిపేసింది. రెడ్‌ ఫోర్ట్‌ (లాల్‌ ఖిలా) మెట్రో స్టేషన్‌ గేట్‌ నంబర్‌ 1 సమీపంలో పార్కింగ్‌ ప్రాంతంలో నిలిపివుంచిన కారులో ఈ భారీ బ్లాస్ట్ జరిగింది. పేలుడు ధాటికి అక్కడ ఉన్న వాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. సమీపంలో నిలిపిన కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు ఒక్కసారిగా దగ్ధమయ్యాయి. ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉందంటే అక్కడికి వెళ్లిన రక్షణ సిబ్బందే క్షణం పాటు స్తంభించిపోయారట. ఓ ప్రత్యక్ష సాక్షి వణుకుతూ మాట్లాడుతూ – “నా కళ్ల ముందు ఆ కార్ ఒక్కసారిగా పేలింది. పేలుడు శబ్దం అంత తీవ్రంగా ఉంది, నా చెవులు కొన్ని నిమిషాలపాటు మూసుకుపోయాయి. ఆ తర్వాత కళ్ల ముందే మానవ శరీర భాగాలు గాలిలో ఎగిరి చుట్టుపక్కల రోడ్డు మీద పడ్డాయి. ఒకరి చెయ్యి తెగిపోయి నా దగ్గరే రోడ్డుపై పడి కనిపించింది. ఆ దృశ్యం మాటల్లో వర్ణించలేను. ఇది సాధారణ బ్లాస్ట్ కాదు, నిజంగా నరక దృశ్యం లాంటిది,” అని కన్నీరు పెట్టుకున్నాడు.


మరో సాక్షి తెలిపిన వివరాలు మరింత వణుకు పుట్టించేలా ఉన్నాయి. “పేలుడు సమయంలో నేల కంపించింది. నా కాళ్లు వణికిపోయాయి. నేల కుంగిపోతోందేమో అనిపించింది. భూమి నన్ను మింగేస్తుందేమో అనిపించింది. ఒక క్షణం నేను కూడా బతికే లేను అనుకున్నాను. పేలుడు ధాటికి పక్కనే ఉన్న స్ట్రీట్‌ లైట్లు పేలిపోయాయి. కార్లలోని ఇంధనం మంటలు పట్టుకుని చుట్టుపక్కల వ్యాపించింది. నా దగ్గర ఉన్నవాళ్లు ఒక్కసారిగా కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. నేను కూడా భయంతో పరుగెత్తాను. మూడు సార్లు కింద పడ్డాను. ఒకరి మీద ఇంకొకరు పడిపోయాం. ఎవరెవరు బ్రతికారు, ఎవరు చనిపోయారు అన్నది కూడా అర్థం కాలేదు. రెండో పేలుడు జరిగితే మేమంతా ముగిసిపోయేవాళ్లమని అనిపించింది,” అని వివరించాడు.



సమీపంలోని ఓ టీ షాప్ యజమాని చెబుతూ – “పేలుడు జరిగినప్పుడు నేను షాప్‌లో కుర్చీలో కూర్చుని ఉన్నాను. ఒక్కసారిగా ఒక ఘోరమైన శబ్దం వినిపించింది. నా కుర్చీ కింద పడిపోయింది. షాప్ గాజులు చిద్రం అయ్యాయి. నాపై గాజు ముక్కలు పడ్డాయి. ఆ క్షణంలో నేనేమి చేయాలో అర్థం కాలేదు. భూమి కంపించిందేమో అనిపించింది. భయంతో బయటికి పరిగెత్తాను. నా వెనకపైనే అనేక కుటుంబాలు పిల్లలతో, మహిళలతో కలిసి పరుగులు తీశాయి. ఇంకో బ్లాస్ట్ వస్తుందేమోనని అందరూ భయపడ్డారు,” అని భయాందోళనతో తెలిపాడు.



ఒక మరొక ప్రత్యక్ష సాక్షి చెప్పిన విషయాలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఆయన మాట్లాడుతూ – “సరిగ్గా బ్లాస్ట్ జరగడానికి పది నిమిషాల ముందు ఓ విచిత్రమైన వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా పక్కనే ఉన్న చెట్లపై కూర్చున్న పక్షులు గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాయి. అక్కడే తిరుగుతున్న కుక్కలు ఏడుస్తూ పరుగులు తీసాయి. ఆ క్షణంలోనే ఏదో భయంకరమైనది జరగబోతోందన్న భావన కలిగింది. ప్రకృతి కూడా ఆ ప్రమాదానికి ముందు సూచన ఇచ్చినట్టుగా అనిపించింది,” అని ఆయన చెప్పారు. పేలుడు తీవ్రతను బట్టి డజన్ల సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం ఉందని మరో సాక్షి పేర్కొన్నాడు. రక్షణ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కొంతమంది గాయపడిన వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: