ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌కు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ వీరేంద్ర సెహ్వాగ్ దిమ్మతిరిగిపోయే షాకిచ్చాడు. అసలే టీమిండియా చేతిలో 3-1తో చిత్తుగా ఓడి అవమానభారంతో ఇంటికి పయనమైన ఇంగ్లీష్ జట్టును ట్రోల్ చేస్తూ సెహ్వాగ్ తాజాగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

 ఈ ఫోటో చూసిన వారంతా సెహ్వాగ్‌ క్రియేటివీటికి ఫిదా అయిపోతున్నారు. ఇంగ్లండ్‌ జట్టు ఓటమి గాయంపై కారం చల్లావంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీరూ ఎప్పుడూ యాక్టివ్‌‌గా ఉంటారనే విషయం తెలిసిందే. టీమిండియాపై ఎవరైనా విమర్శలు చేస్తే వారికి సెహ్వాగ్‌ తన స్టైల్లో ఆన్సర్ చేస్తాడు. సరైన సమయంలో ప్రత్యర్థులకు సమాధానమిస్తాడు. తాజాగా ఇంగ్లండ్‌పై సెహ్వాగ్ అలాంటి పోస్టే ఒకటి చేశాడు.

ఇటీవల టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఘోరంగా ఓడింది. తొలి టెస్టులో గెలిచినా.. తరువాతి మూడు టెస్టుల్లోనూ ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో భారత్ సునాయాస విజయాలను దక్కించుకుంది. ప్రధానంగా మూడో టెస్టు, నాలుగో టెస్టుల్లో టీమిండియా బౌలర్ల దెబ్బకు ఇంగ్లీష్ బ్యాటింగ్ లైనప్ పేకమేడల్లా కూలిపోయింది. దీంతో మూడో టెస్టు రెండు రోజుల్లోనే ముగిస్తే.. నాలుగో టెస్టు మూడు రోజుల్లో ముగిసింది. దానికి తోడు నాలుగో టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ తేడాతో ఓడి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఆ ఓటమి భారంతోనే ఇంగ్లండ్ బయలుదేరింది. అయితే ఈ సిరీస్ ప్రారంభం కాకముందు నుంచే ఇంగ్లండ్ మాజీలు టీమిండియాను విమర్శించారు. ఇంగ్లండ్‌ను గెలిచే సత్తా భారత జట్టుకు లేదని జోస్యం కూడ చెప్పారు. తీరా వాళ్ల జట్టు ఓడిపోవడం మొదలు పెట్టేసరికి భారత పిచ్‌లను విమర్శించడానికీ వెనుకాడలేదు. అయితే వాటన్నింటికీ సెహ్వాగ్ ఒక్క పోస్ట్‌తో అదిరిపోయే జవాబిచ్చాడు.

సెహ్వాగ్ శనివారం తన ఇన్‌స్టాగ్రాంలో ఓ పోస్ట్ పెట్టాడు. అందులో ఓ మెదడు ఫోటోను షేర్ చేశాడు. దాని పక్కనే ఇంగ్లండ్ జట్టు దీనిని(మెదడును) అహ్మదాబాద్‌లో మాత్రమే పొగొట్టుకోలేదు. మొత్తానికి కోల్పోయారు’ అని రాసుకొచ్చాడు. అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన టీమిండియాను ప్రశంసించాడు. 3-1 సిరీస్ విజయాన్ని దక్కించుకోవడం గొప్ప విషయమని అన్నాడు. ‘టీమిండియాకు శుభాకాంక్షలు. సిరీస్‌ను అద్భుతంగా గెలిచారు. 3-1తో ఇంగ్లండ్‌ను చిత్తు చేశారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో కూడా ఇలాగే రాణించాలని ఆశిస్తున్నా’ అని సెహ్వాగ్ తన పోస్టులో రాసుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: