రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను బిజెపి నాయకత్వం అర్ధాంతరంగా తీసేయటంతో చాలామందికి షాక్ కొట్టినట్లుంది. ఇందులో కేంద్ర మాజీమంత్రి, ఫిరాయింపు ఎంపి సుజనాచౌదరి కూడా ఒకడు. పాతపాటే అయినా మళ్ళీ కొత్తగా పాడుదామని అనుకుంటున్నట్లున్నాడు. అదేమిటయ్యా అంటే రాజధానిగా అమరావతిని ఇంచుకూడా కదల్చలేరని. కారణం ఏమిటంటే రాజధాని అన్నది కేంద్రప్రభుత్వంలోని అంశమట. రాజధానిని మార్చాలని రాష్ట్రప్రభుత్వం అనుకున్నా అందుకు కేంద్రప్రభుత్వం అనమతించాలని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఎంపి మాటలు ఎలాగుందంటే తెలుగుదేశంపార్టీ జనాలను సంతృప్తి పరచటం కోసమే నోటికొచ్చిందేదో మాట్లాడినట్లుంది.




ఎందుకంటే రాజధాని విషయం కేంద్రప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్వయంగా కేంద్రమంత్రులే అనేక సందర్భాల్లో పార్లమెంటులోనే ప్రకటించేశారు. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రప్రభుత్వ పరిధిలోనిదే అంటూ స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. బహుశా సుజనా ఆ విషయాన్ని మరచిపోయారో లేకపోతే రాజకీయ గురువు చంద్రబాబునాయుడు లాగ జనాలను మభ్యపెడదామని చూస్తున్నారో అర్ధం కావటం లేదు. కొత్తగా అధ్యక్షుడిగా అపాయింట్ అయిన సోము వీర్రాజు కూడా రాజధాని అంశానికి కేంద్రప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పేశాడు. ఇంతకీ సుజనా ఇపుడు రాజధాని అంశాన్ని ఎందుకు ప్రస్తావించాడంటే ఎల్లోమీడియాలో దింపుడు కళ్ళెం ఆశ చావని కారణంగానే అదే పనిగా అమరావతి అంశాన్ని ఎంపితో మాట్లాడిస్తోందనే విషయం అర్ధమైపోయింది. రాజధాని గురించి సుజనా వ్యాఖ్యలను ఖండించటం ద్వారా పార్టీనే ఎంపికి పెద్ద షాక్ ఇచ్చింది.




రాజధాని అంశంపై ఎంపి చెప్పిన కొత్త లాజిక్ ఏమిటంటే రాజధాని ప్రాంతంలోని రైతులకు పన్ను మినహాయింపులను ఇచ్చింది కేంద్రం కాబట్టే రాజధాని తరలింపులో కూడా కేంద్రం ఆమోదం తప్పనిసరట. నిజంగా ఇది ఓ పిచ్చి లాజిక్ అనే చెప్పాలి. అప్పట్లో రైతుల నుండి భూమి తీసుకునేందుకు చంద్రబాబు ప్రత్యేకంగా చేసిన విజ్ఞప్తికి కేంద్రం అప్పట్లో సానుకూలంగా స్పందించింది కాబట్టే పన్ను మినహాయింపిచ్చింది. అంత మాత్రాన కేంద్రం ఆమోదం ఉండితీరాలనే నిబంధన ఎక్కడా లేదు.  జగన్ను భయపెట్టి ఎలాగైనా సరే రాజధాని అమరావతి నుండి తరలించకుండా ఒత్తిడి పెట్టాలని బహుశా సుజనా ప్రయత్నిస్తున్నట్లుంది. లేకపోతే ఇంత మతిలేని మాటలు మాట్లాడే అవకాశమే లేదు.



రాజధాని అమరావతి నుండి వైజాగ్ కు వెళ్ళిపోవటం ఖాయమని సుజనాకు అర్ధమైపోయుంటుంది. అందుకనే దింపుడు కళ్ళెం ఆశతో రాజధాని అమరావతి నుండి కదలదంటూ ఒకటికి పదిసార్లు అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగ చెప్పిందే చెబుతున్నాడు. నిజానికి ఈ అంశంలో సుజాన స్టేట్మెంట్ ను వ్యతిరేకించే వారు పార్టీలోనే చాలామందున్నారు. ఇప్పటికే జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు కేంద్రప్రభుత్వ స్టాండునే పదే పదే మీడియా ముందే కుండబద్దలు కొట్టినట్లు ఎన్నోసార్లు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: