వాట్సప్ సహా అలాంటి మరో 20 యాప్లను నిషేధించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అవసరమైతే వాటిద్వారా పంపే సందేశాలను ప్రభుత్వ వర్గాలు సేకరించేలా ఉండాలని, లేని పక్షంలో ఆ యాప్లను నిషేధించాలంటూ హర్యానాకు చెందిన ఆర్టీఐ కార్యకర్త సుధీర్ యాదవ్ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ సోషల్ మీడియా యాప్ లను నిషేధించాలని లేకుంటే, వాటి నుంచి వెళ్లే డేటా ప్రభుత్వ వర్గాలకు అందుబాటులో ఉండేలా ఆదేశించాలని అంతకుముందు సుధీర్ తరఫు న్యాయవాది కోర్టు ముందు వాదనలు వినిపించారు. మధ్యలో ఎవరూ తెలుసుకోలేని విధంగా ఈ సమాచారం ఉందని, దీనివల్ల భద్రతకు ముప్పు ఏర్పడుతుందని తెలిపారు.
ఈ యాప్ల సాయంతో ఉగ్రవాదులు, నేరస్థులు కోడ్ మెసేజ్లు పంపుకొంటూ నేరాలకు పాల్పడుతున్నారని యాదవ్ ఆరోపించారు. అలాంటి కోడ్ మెసేజ్లను చేధించడం దర్యాప్తు సంస్థలకు చాలా కష్టమైన పని అని యాదవ్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ యాప్ల వల్ల దేశ భద్రతకు భంగం కలుగుతుందని.. వెంటనే నిషేధం విధించాలని కోరారు.
వాట్సప్ సహా 20 యాప్లు ఎన్క్రిప్షన్ను అమలుచేస్తున్నాయని, దీనివల్ల సందేశం పంపేవారు, దాన్ని రిసీవ్ చేసుకున్నవారు తప్ప మధ్యలో ఎవరూ వాటిని చదవలేరని సుధీర్ యాదవ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇది దేశభద్రతకు ముప్పు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. యాదవ్ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ విషయంపై టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అపల్లేట్ ట్రిబ్యూనల్ను(టీడీఎస్ఏటీ) సంప్రదించాలని సూచించింది.