నిర్మల్
జిల్లా భైంసాలో కరోనా విధ్వంసం సృష్టిస్తోంది. ఇక్కడ కొవిడ్ బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. భైంసాలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర పాఠశాలలో 176 మంది విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా వీరిలో 25 మందికి వైరస్ సోకింది. ఇదే పాఠశాలలో మరో తొమ్మిది మంది విద్యార్థులు బుధవారంనాడు వైరస్ బారిన పడ్డారు. దీంతో మొత్తం 34 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణైంది. ఒకే పాఠశాలలో ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కరోనా బారిన పడటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. వెంటనే మిగతా విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సెలవుపై ఇంటికెళ్లిన విద్యార్థులను కూడా పాఠశాలకు రప్పిస్తున్నారు.
భైంసా మండలంలో విధి నిర్వహణలో ఉన్న 29 మంది పోలీసు సిబ్బందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా ఒక పోలీసు వైరస్ బారిన పడ్డారు. దీంతో పాఠశాల, పోలీస్స్టేషన్తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా అధికారులు శానిటైజ్ చేయించారు.