ఖాతాదారులకు షాకుల మీద షాకులు ఇచ్చే సంస్థగా పేరొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదే ఒరవడిలో తాజాగా ఇంకో షాక్ ఇచ్చింది. ఏటీఎం వాడకం విషయంలో ఇన్నాళ్లు షరతులు విధించిన ఈ బ్యాంకింగ్ దిగ్గజం తాజాగా ఇంకొన్ని షరతులు పెట్టింది. ఇటు ఆన్లైన్లో అటు ఆఫ్లైన్లో దిమ్మతిరిగే రూల్స్ పెట్టింది. ఏకకాలంలో తనదైన శైలిలో సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేసే ఆదేశాలు వెలువరించింది.
ఏటీఎం కార్డుతో నగదు విత్డ్రా చేసుకునే కస్టమర్లకు కొన్ని పరిమితులను విధించింది. ఎస్బీఐ కార్డును ఉపయోగించి ఇకపై రోజుకు రూ.40వేలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ లావాదేవీలు ఒకరోజుకు రూ.75వేలు మాత్రమే జరపాలని నిబంధన విధించింది బ్యాంకు. ఇప్పటికే బ్యాంకు విధించిన ఉచిత నగదు ఉపసంహరణ విషయంలో.. పరిమితి దాటితే ఖచ్చితంగా అదనపు చార్జీలు వసూలు చేస్తామని బ్యాంకు తెలిపింది. అదేవిధంగా ఏటీఎం కార్డు వినియోగిస్తున్నందుకు గాను నిర్వహణ చార్జీలుగా ఏడాదికి జీఎస్టీతో కలిపి రూ.125, కార్డు మార్చాల్సి వస్తే జీఎస్టీతో కలిపి రూ.300 వసూలు చేయనున్నట్టుగా బ్యాంక్ తెలిపింది. ఇలా షాకులు ఇచ్చిన ఎస్బీఐ ఓ గుడ్ న్యూస్ కూడా తెలిపింది. ఏటీఎం ద్వారా పిన్ నెంబర్ మార్పు, చెక్బుక్ అప్లికేషన్ వంటి బ్యాంక్ ఆధారిత సేవలతో పాటు వివిధ బిల్లుల చెల్లింపులు, మొబైల్ రీచార్జ్ సర్వీస్ వంటి కొత్త సర్వీసులను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్టుగా బ్యాంక్ వెల్లడించింది.