అయితే హెచ్–1బీ వీసాలపై అమెరికా ప్రభుత్వ ఆంక్షల అంశం మీద అయన స్పందిస్తూ తమ ఉద్యోగుల్లో మూడింట రెండొంతుల మంది స్థానికులే ఉన్నారని విజయకుమార్ చెప్పారు.అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యయాలపరంగా కంపెనీ పై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అని, వచ్చే ఏడాది మాత్రం కొంత ఉండవచ్చని తెలిపారు.ఇక షేర్ విషయానికి వస్తే లాభాల స్వీకరణతో హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేరు దాదాపు 4 శాతం తగ్గింది. బీఎస్ఈలో ఒక దశలో 4.47% క్షీణించి రూ. 821 స్థాయిని కూడా తాకింది. చివరికి 3.76 శాతం క్షీణతతో రూ. 827.10 వద్ద క్లోజయ్యింది. బీఎస్ఈ 30లో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. ఎన్ఎస్ఈలో 3.48 శాతం తగ్గి రూ. 830.05 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 7.23 లక్షలు, ఎన్ఎస్ఈలో 2.89 కోట్ల షేర్లు చేతులు మారాయి.
ఉద్యోగుల విషయానికి వస్తే సెప్టెంబర్ ఆఖరు నాటికి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 1,53,085గా ఉంది. ఐటీ సేవల విభాగంలో ఉద్యోగుల వలసలు రేటు 12.2 శాతంగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో 1,500 పైచిలుకు ఫ్రెషర్స్ను కంపెనీ జాయిన్ చేసుకుంది. ఉద్యోగుల వేతనాల విషయానికి వస్తే కరోనా వైరస్ పరిణామాల కారణంగా వేతనాల పెంపు గతంలో వాయిదా పడింది.కానీ ఇప్పుడు వేతనాల పెంపును అక్టోబర్ 1 లేదా జనవరి 1 వర్తించేలా చేస్తాము అన్నారు. అదికూడా దశలవారీగా వివిధ స్థాయిల ఉద్యోగులకు వేతనాల పెంపును అమలు చేయనున్నట్లు విజయకుమార్ చెప్పారు.