500 మంది సాధార‌ణ ఉద్యోగులు ఒకే ఒక్క రోజులో కోటీశ్వ‌రుయ్యారు. దీంతో ఒక్క‌సారిగా వాళ్ల ఫేట్ మారిపోయింది. నాస్‌డాక్‌లో లిస్టింగ్‌ చేసిన భారత సంతతికి చెందిన ఫ్రెష్‌వర్క్స్‌ ఐటీ సంస్థ షేర్లు ఒక్కరోజులోనే  32 శాతం మేర పెరిగిపోయాయి.  బుధవారం రోజున ఫ్రెష్‌వర్క్స్‌ కంపెనీ షేర్లు నాస్‌డాక్‌ ట్రేడింగ్‌లో 47.55 డాలర్ల వద్ద ముగిసిపోయాయి. దీంతో  కంపెనీ మార్కెట్‌ విలువ ఏకంగా 13 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. 

కాగా, ఫ్రెష్‌వర్క్స్‌ కంపెనీలో ప‌ని చేస్తున్న సుమారు 500 మంది భారతీయ ఉద్యోగులు ఒక్కరోజులోనే కోటీశ్వరుల‌య్యారు.  ఆ కంపెనీ వ్యవస్థాపకుడు గిరీష్‌ మాతృబూతం ప్ర‌క‌టించారు. ఇందులో సుమారు 70 మంది ఉద్యోగులు 30 ఏళ్ల లోపు వారు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 4,300 ఉద్యోగులు ఫ్రెష్‌వర్క్స్  కంపెనీకి  ఉన్నారు. కంపెనీలో సుమారు 76 శాతం మంది ఉద్యోగులు షేర్ల‌ను కలిగి ఉన్నారు.


   నాస్‌డాక్‌ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్టింగ్‌ చేసిన భారతీయ సాఫ్ట్‌వేర్‌ సంస్థగా ఫ్రెష్‌వర్క్ ఉంది. 2010 సంవ‌త్సరంలో ఫ్రెష్ వర్క్స్ సంస్థను భారత దేశంలో గిరీష్ మాతృబూతం,  షాన్ కృష్ణసామి సంయుక్తంగా స్థాపించారు. వినియోగ‌దారుల‌కు మరింత చేరువ‌వ్వ‌డం కోసం కొద్ది రోజుల క్రితమే భారత్‌ నుంచి అమెరికాకు ఫ్రెష్‌వర్క్స్‌ను తరలించింది యాజమాన్యం. ఇప్పుడు కాలిఫోర్నియాలోని శాన్ మేటియోలో, అలాగే భార‌త్‌లోని చెన్నైలో ఎక్కువగా ఉద్యోగుల‌ను క‌లిగి ఉంది ఫ్రెష్‌వర్క్స్.


ఈ కంపెనీ ఆక్సెల్ , సీక్వోయా క్యాపిటల్ వంటి పెట్టుబడిదారుల నుంచి నిధులను స‌మీక‌రించింది.  ఇన్ఫోసిస్, విప్రో, డబ్ల్యుఎన్ఎస్, డాక్టర్ రెడ్డిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి డజనుకు పైగా నాస్డాక్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో జాబితా చేసిన భారతీయ కంపెనీలలో ఒక‌టిగా ఫ్రెష్‌వర్క్స్ కంపెనీ నిల‌బ‌డ‌నుంది. 1999లో నాస్డాక్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో జాబితా చేసిన మొదటి భారతీయ సంస్థగా ఇన్ఫోసిస్ రికార్డులకు ఎక్కింది. ఈ సంద‌ర్భంగా ఫ్రెష్‌వ‌ర్క్ ఐటీ సంస్థ సీఈఓ, వ్య‌వ‌స్థాప‌కుడు గిరీష్ మాతృబూతం, కంపెనీ ఉద్యోగులు ఆనందం వ్య‌క్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: